హైదరాబాద్ : పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హిందీ భాష మాట్లాడిన తీరును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అవమానపరచడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డిని హిందీ బాగాలేదనే పద్ధతిలో నిండు సభలో నిర్మలా సీతారామన్ అవహేళన చేస్తూ మాట్లాడడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. ఒక గౌరవ సభ్యుని పట్ల అనుచితంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. సభ కస్టోడియన్గా సభ్యుల హక్కులు మర్యాదను కాపాడాల్సిన లోక్సభ స్పీకర్ సైతం రేవంత్ రెడ్డి రక్షణకు రాకపోగా నిర్మలా సీతారామన్ను సమర్ధించే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు.
దక్షిణాది ఎంపీలు సభలో మాట్లాడేటప్పుడు బడి పిల్లలను గదమాయించే హెడ్మాస్టర్ తరహాలో లోక్సభ స్పీకర్ వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పేరొన్న 22 భాషల్లో పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి హిందీలో మాట్లాడడాన్ని ప్రోత్సహించకుండా హేళన చేయడం సమర్థనీయం కాదన్నారు. అయినా రేవంత్ రెడ్డి తన భావాన్ని హిందీలో అర్థమయ్యే రీతిలోనే స్పష్టంగా వ్యక్తీకరించారని, ఆయన లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కించపరిచేలా మాట్లాడారన్నారు. ఆమె తక్షణమే తన వ్యాఖ్యలను వెనకి తీసుకొని విచారం వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు లోక్సభ స్పీకర్ సైతం సభ్యుల వ్యక్తీకరణలో ఇబ్బందులు ఉంటే సారాంశాన్ని గ్రహించేందుకు సహకరించాలే తప్ప అనుచితంగా వ్యవహరించకూడదన్నారు.
విభిన్న భాషలు సంసృతులు, జాతులు నిలయమైన భారత దేశంలో ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూనంనేని మండిపడ్డారు. ఐఐటి, ఐఐఎం, కేంద్రీయ విద్యాలయాలు తదితర విద్యాసంస్థల్లో హిందీ భాషను తప్పనిసరి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా నేతృత్వంలోని అధికార భాష పార్లమెంటరీ కమిటీ లోక్ సభ స్పీకర్కు నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఒకవైపు హిందీని తప్పనిసరి చేయాలని చూస్తూ.. మరోవైపు హిందీ ఇతర రాష్ట్రాల వారు హిందీలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే అవమానపరచడం ద్వంద వైఖరికి నిదర్శనమని పేరొన్నారు. తద్వారా హిందీని ఆధిపత్య భాషగా మీద భాషలపై పెత్తనం చేయాలని బీజేపీ దురాలోచన స్పష్టమవుతోందని కూనంనేని దుయ్యబట్టారు. యాస, భాషలను అవమానిస్తే ప్రజలు సహించరన్నారు. గతంలో భాషా దురహంకారానికి వ్యతిరేకంగా పొట్టి శ్రీరాములు దీక్ష చేసి అమరులయ్యారని , ఎన్టీ రామారావు ఉద్యమించారని అన్నాదురై ద్రవిడ ఉద్యమాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. దురుద్దేశపూరితంగా హిందీని తప్పనిసరి చేసే ప్రయత్నాలను భారత దేశ ప్రజలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తిప్పికొడతాయని కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.