హైదరాబాద్ : నరేంద్ర మోదీ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్ని భ్రష్టు పట్టాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ప్రశ్నించే వారిని అణిచివేయడం, ఈడీ, సీబీఐ దాడులతో బెదిరించడం మోదీకి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో ప్రజల కోసం మోదీ ఒక్క మంచి పని కూడా చేయలేదని గుర్తు చేశారు.
హైదరాబాద్ నారాయణగూడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అమలు చేసినట్టు నిరూపిస్తే చెప్పుతో కొట్టుకుంటానని బండి సంజయ్ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా పలు హామీలిచ్చి అమలు చేయలేదు. మరి కేంద్రం అమలు చేయనందుకు కూడా చెప్పుతో కొట్టుకుంటాడా? అని సాంబశివరావు ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ మాటను కూడా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. అది నెరవేరలేదు. నల్ల ధనం తీసుకొచ్చి నిరుపేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని చెప్పారు. అది కూడా నెరవేరలేదని సాంబశివరావు మండిపడ్డారు.
అమిత్ షా పేరులోనే ముస్లిం పేరు ఉంది. అతని పేరు పార్శీ భాషకు చెందినది అని సాంబశివరావు తెలిపారు. దేశంలోని క్రిస్టియన్లు, ముస్లింలందరి పేర్లు మారుస్తారా? ఇతరుల పేర్లు, పట్టణాల పేర్లు మార్చే ముందు అమిత్ షా తన పేరును మార్చుకోవాలని సూచించారు. దేశంలో అనేక పట్టణాలకు ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి. వాటిని కూడా మారుస్తారా? అని ప్రశ్నించారు. ఏకపక్షంగా పట్టణాల పేర్లు ఎలా మారుస్తారు? కరీంనగర్ను కరీనగర్గా పిలవడం సరికాదన్నారు. ఆనాడు పేర్లు మార్చిన గజిని మహమ్మద్, గౌరీ మహమ్మద్, ఔరంగాజేబ్కు మీకు తేడా ఏంటి అని ప్రశ్నించారు. పేర్లు మార్చేందుకు మీరు ఎవరు అని సాంబశివరావు అడిగారు.