మునుగోడు : మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు, ఎవరి వల్ల వచ్చిందో అందరికీ తెలుసు.. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు బీజేపీకి చెంప దెబ్బ వంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో మంగళవారం జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీకి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని, రాజ్యాంగం అంటే లెక్కే లేదని విమర్శించారు.
ఎన్నికల్లో ఎవరు గెలిచినా అధికారంలో తామే ఉండాలనే నీచ సంస్కృతికి తెరలేపుతున్నారన్నారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో అది రుజువైందని, తాజాగా తెలంగాణలోనూ అలాంటి కుట్రకు తెరలేపి బొక్కబోర్లా పడిందని తెలిపారు. దేశమంతా బీజేపీయే అధికారంలో ఉండాలని మోదీ కల కంటున్నారని, అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి అక్రమ మార్గంలో కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీని బలపడనీయమన్నారు.
మునుగోడులో గెలుపు కోసం బీజేపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ఆశించిన ఫలితం రాలేదని పేర్కొన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిన్నస్తుదని, డబ్బుకు లొంగకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నదని విమర్శించారు. అవసరాన్ని బట్టి సీబీఐ, ఈడీ వంటి సంస్థలను వాడుకుంటున్నదని తెలిపారు. కలిసికట్టుగా పనిచేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించుకున్నామని, అదే స్ఫూర్తితో నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు, నాయకులు పాల్గొన్నారు.