KTR | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంపై శాసనసభలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై నాలుగు గోడల మధ్య చర్చ కన్నా ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ‘ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది. ఇదే విషయంపై ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఇదే అంశం మీద కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ ఆమోదం వచ్చిందని రకరకాల లీకులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు ఇస్తున్నారు. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.
మీడియాలో అవాస్తవాల ప్రచారం
తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్నివర్గాల మన్ననలు అందుకున్నది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగాల్సి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని ఏకపక్షంగా రద్దు చేసింది. అప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది.
ఒప్పందం పారదర్శకం
నిజానికి ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని ఇదివరకే నేను వివరంగా చెప్పాను. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హకు ఉన్నది. కనుక మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అన్ని విషయాలు సవివరంగా రాష్ట్ర ప్రజలకు శాసనసభ వేదికగా చెప్తాం. శాసనసభ జరుగుతున్నది కనుక మీకు అనుకూలమైన రోజే ఈ చర్చను పెట్టండి. ఫార్ములా-ఈ అంశంలో ఎలాంటి అవకతవకలు కానీ, అవినీతి కానీ జరగలేదు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేసును కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
స్పీకర్కు బీఆర్ఎస్ఎల్పీ వినతి
ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చ పెట్టాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్ను కోరింది. ఈ మేరకు బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణలో కేటీఆర్ ఎటువంటి పొరపాట్లు చేయలేదని అన్నారు. నిబంధనల మేరకే నిర్వాహకులకు చెల్లింపులు జరిపినట్టు కేటీఆర్ ఇప్పటికే స్పష్టంచేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం మాత్రం ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీపై, కేటీఆర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య కాకుండా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు అసెంబ్లీ వేదికగా తమ పార్టీ నేత కేటీఆర్ చర్చకు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి ఈ అంశాన్ని సభలో చర్చించేలా సభాపతి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, కే మాణిక్రావు, చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.