హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ.. ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలమంది నగరవాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలిటరీ అధికారులకు ఆదేశాలివ్వాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు.. రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్కు లేఖరాశారు. రోడ్ల మూసివేత అంశాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని.. గతంలోనూ లేఖలు రాసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తాజా గా లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైనవాటిని కొవిడ్ కేసుల వ్యాప్తిని కారణంగా చూపి మూసివేసిందని పేర్కొన్నారు. దీంతో లక్షల మందికి ఇబ్బందులు తప్పడంలేదని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. పదే పదే ఇలా రోడ్లను మూసివేయడంతో నగర ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి తమ ఇండ్లకు వెళ్లాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
తెలంగాణ ప్రభుత్వం మే, జూన్ నెలల్లో తీసుకున్న కొవిడ్ నియంత్రణ చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు చాలావరకు తగ్గాయని, ప్రస్తుతం కొవిడ్ పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ.. కరోనా పేరు చెప్పి తాజాగా మరోసారి రోడ్ల మూసివేతకు పాల్పడటం అత్యంత బాధాకరమన్నారు. స్థానిక కంటోన్మెంట్బోర్డుకు సంబంధం లేకుం డా లోకల్ మిలిటరీ అథారిటీ రోడ్ల మూసివేతకు పాల్పడుతున్నదని తెలిపారు. కంటోన్మెంట్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 258 కి ఇది పూర్తి విరుద్ధమని కేటీఆర్ తన లేఖలో రాజ్నాథ్సింగ్కు గుర్తుచేశా రు. కంటోన్మెంట్ బోర్డు చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే రోడ్డు మూసివేసే ప్రక్రియ ఉండాలని, కానీ తమ ఇష్టారీతిన అత్యంత చిన్న కారణాలు చూపి పదే పదే రోడ్లను మూసివేస్తున్నారని లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
గతంలో ఈ అం శాన్ని రక్షణశాఖ దృష్టికి తీసుకొచ్చినప్పుడు కంటోన్మెంట్ బోర్డుకు సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడరాదని ఇచ్చిన ఆదేశాలను సైతం స్థానిక మిలిటరీ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. రక్షణ శాఖ కింద పనిచేసే అధికారులే, తమశాఖ నిర్దేశించిన మార్గదర్శకాలను, సూచనలను పట్టించుకోవడం లేదని తెలిపారు. స్థానిక మిలిటరీ అధికారుల పరిధిలో ఉన్న రోడ్ల పైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే రక్షణశాఖ కార్యదర్శితో ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, ఆ సమావేశంలో ఇందుకు సూచనప్రాయంగా అంగీకరించారని, ఈ దిశగా రక్షణశాఖ తుది నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. ఈలోగా రోడ్లు మూసివేయకుండా తగిన అదేశాలిచ్చి హైదరాబాద్ పౌరులకు ఊరట కల్పించాలని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ను మంత్రి కేటీఆర్ కోరారు.