కర్ణాటక ఐటీ శాఖ మంత్రి అశ్వత్తో మంత్రి కేటీఆర్ భేటీ
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్తోనూ సమావేశం
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు వెళ్లిన మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. దీనిలో భాగంగా గురువారం ఆయన కర్ణాటక ఐటీ శాఖ మంత్రి డాక్టర్ అశ్వత్ నారాయణ్తో భేటీ అయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘కర్ణాటక ఐటీ మంత్రి డాక్టర్ అశ్వత్ నారాయణ్ను చాలా ఆప్యాయంగా కలుసుకున్నా. భారత్లో రెండు ప్రధాన టెక్ హబ్లుగా బెంగళూరు, హైదరాబాద్ విరాజిల్లుతున్నాయి.
వీటని ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు మేం పరస్పరం పోటీపడతాం, సహకరించుకొంటాం’ అని ట్వీట్ చేశారు. దావోస్లో కేటీఆర్ను కలవడం చాలా ఆనందంగా ఉన్నదని అశ్వత్ నారాయణ్ పేర్కొన్నారు. ‘బెంగళూరు, హైదరాబాద్ ఎల్లప్పుడూ మంచి అనుబంధాన్ని పంచుకుంటాయి. భవిష్యత్తులో మరిన్ని సహకారాల కోసం ఎదురుచూస్తున్నాం’ అని రీ ట్వీట్ చేశారు. దావోస్లో మంత్రి కేటీఆర్ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ను కూడా కలుసుకున్నారు. ఆ ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. ‘ఎల్లప్పుడూ ఎనర్జిటిక్గా ఉండే నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ జీ.. మిమ్ములను కలుసుకోవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది సార్’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.