రాజన్న సిరిసిల్ల, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఆకాంక్షించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, బొప్పాపూర్ శివారులోని మూడుగుళ్ల ఆలయం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల హనుమాన్, సీతారామచంద్రస్వామి, వెంకంపేట హనుమాన్ ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆయాచోట్ల నిర్వాహకులు, ఆలయ కమిటీ, భక్త మండలి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
రాముడి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతర పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆయాచోట్ల నాయకులు, యువకులు, చిన్నారులు సెల్ఫీల కోసం ఎగబడగా, కేటీఆర్ సైతం ఓపికతో సెల్ఫీలు, ఫొటోలుదిగి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన వెంట బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఉన్నారు.