హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అధికార చిహ్నం నుంచి వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమని స్పష్టంచేశారు. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని, యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చేరిపేయడమేనని పేర్కొన్నారు. సీఎంది మూర్ఖపు ఆలోచన అని, రెండునాలల వైఖరి అని మండిపడ్డారు.
రాష్ట్ర పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. ‘మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం? చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు?’ అని ప్రశ్నించారు. అవి రాచరికపు గుర్తులు కావని, వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలని స్పష్టంచేశారు. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని తెలిపారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో ఏమున్నదో తెలుసా? అని ప్రశ్నించారు. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలొండ నవాబుల గొప్ప వెలుగే.. చార్మినార్ అని, అధికారిక గీతంలో కీర్తించి, అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా? అని నిలదీశారు. చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదని, విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు ఐకాన్ అని గుర్తుచేశారు.
కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదని, సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని పేర్కొన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులు ఉన్నాయని, మరి వాటిని కూడా తొలగిస్తారా? అని ప్రశ్నించారు. భారత జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలు ఉన్నాయని, జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉన్నదని, వాటి సంగతేమిటో చెప్పండని నిలదీశారు.
కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా? ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా? అంటూ సందేహం వ్యక్తంచేశారు. ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారని, రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా? అని ప్రశ్నించారు. గత పదేండ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉన్నదని, సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉన్నదని పేర్కొన్నారు.