Minister KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): మీడియాలో ప్రచారమవుతున్నట్టుగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తరువాత దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గితే.. దక్షిణాన బలమైన ప్రజా ఉద్యమం మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశంలో అత్యున్నతమైన పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలకు ప్రతినిధులుగా, భారతీయులుగా ఉండటాన్ని తాము గర్వంగా భావిస్తున్నామని సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల గొంతును అణచివేస్తే, ప్రాతినిధ్యాన్ని తగ్గించాలని చూస్తే ప్రేక్షకుల్లాగా ఉండబోమని తేల్చి చెప్పారు. వీటన్నింటినీ ఢిల్లీ వింటుందని, వివేకవంతంగా ఆలోచిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఎంతో చారిత్రక నేపథ్యమున్న మూసీ నదిని గత ప్రభుత్వాలు పట్టించుకోక మురికికూపంగా మార్చాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తమ ప్రభుత్వం మూసీని పరిరక్షించి, దాని సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, ఇప్పుడు నదిపై ఆధునిక వంతెనలు నిర్మిస్తున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ సోమవారం నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. మూసీ నదిపై పారిస్ తరహాలో రూ. 545 కోట్లతో 15 వంతెనల నిర్మాణాలకు గానూ ఏడు చోట్ల ఆయన శంకుస్థాపన చేశారు. మూసారంబాగ్, ఫతుల్లాగూడ వద్ద ఏర్పాటుచేసిన సభల్లో మాట్లాడారు. తొమ్మిదన్నర ఏండ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేసిన పని ప్రజల కండ్ల ఎదుటే ఉన్నదని, పనిచేసే నాయకుడిని, ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. హైదరాబాద్ వాసులు శాంతికాముకులు, అభివృద్ధిని కోరేవారని, కులాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కొంతేనని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనకు 31 చోట్ల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కోకాపేట ఎస్టీపీ వినియోగంలోకి రాగా.. కొత్తగా దుర్గంచెరువు వద్ద నిర్మించిన 7 ఎంఎల్డీ ఎస్టీపీ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. వచ్చే నెలాఖరుకల్లా 31 ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకొవచ్చి.. రెండు వేల ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీలోకి వదులుతామని పేర్కొన్నారు. ఫ్రాన్స్, గ్రీస్ లాంటి దేశాలకు అధికారులు వెళ్లి అక్కడ వందల ఏండ్ల కింద నిర్మించిన వంతెనలను పరిశీలించి వచ్చారని, అదే తరహాలో మన మూసీ నదిపై బ్రిడ్జీలను నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ వంతెనలు శాశ్వతంగా ఉంటాయని, ఇందుకు తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. దుర్గంచెరువు వద్ద నిర్మించిన కేబుల్ బ్రిడ్జి సినిమా షూటింగ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిందని, అంతకు రెట్టింపు స్థాయిలో మూసీ నదిపై నిర్మించే బ్రిడ్జిలు అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా నిలుస్తాయని అన్నారు. మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ కలను నేరవేర్చుతామని చెప్పారు.
రూ. 5వేల కోట్లతో ఎస్ఎన్డీపీ, రూ.4 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ రెండో దశ
హైదరాబాద్లో రోడ్లు, కరెంట్, మంచినీళ్ల సౌలత్మెరుగుపర్చుకున్నామని, రూ.1000 కోట్లతో ఎస్ఎన్డీపీ ద్వారా నాలాల అభివృద్ధి పనులు తుది దశకు చేరాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్వరలోనే రూ.5వేల కోట్లతో ఎస్ఎన్డీపీ, రూ. 4వేల కోట్లతో ఎస్ఆర్డీపీ రెండో దశ పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఓఆర్ఆర్ తరహాలో పశ్చిమ వైపు నుంచి తూర్పు వరకు రోడ్డు కమ్ ఎలివేటెడ్ బ్రిడ్జిని నిర్మించబోతున్నామని, ఇందుకు రూ.10వేల కోట్ల తో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే నాగోల్ నుంచి ఎల్బీనగర్కు మెట్రో అనుసంధానంతోపాటు పెద్ద అంబర్పేట వరకు మెట్రోను విస్తరించనున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ప్రజా రవాణాను, రహదారులను మెరుగుపరుస్తామని చెప్తే నమ్మలేదని కానీ తాము చేసిన పనులను ఎల్బీనగర్ చౌరస్తా ఇందుకు నిదర్శనమని చెప్పారు. జీహెచ్ఎంసీతోపాటు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మన పిల్లలు ఇన్స్ట్టాగ్రాంలో రీల్స్ చేసి పెట్టడం సంతోషాన్ని ఇస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ఇక్కడి నుంచే దాదాపు 50% ఆదాయం రాష్ర్టానికి వస్తున్నదని, సుభిక్షమైన నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
సుడిగాలి పర్యటన
తొలుత ఫతుల్లాగూడ, పీర్జాదిగూడ మార్గంలో మూసీ నదిపై బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ ఆ తరువాత ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలో రూ.50 లక్షలతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ పార్కును పరిశీలించారు. ఆనంతరం ఉప్పల్ భగాయత్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఐదు వంతెనలకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి రూ.52 కోట్ల వ్యయంతో మూసీ నదిపై మూసారాంబాగ్ పాత బ్రిడ్జి స్థానంలో కొత్తగా నిర్మించనున్న బ్రిడ్జి పనులకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బలాల తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్త, మాజీ ఎమ్మెల్యే ఎం సుధీర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్, జోనల్ కమీషనర్ పంకజ, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త తదితరులు పాల్గొన్నారు.
త్వరలో 40వేల డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ
గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్కు తెచ్చామని, అక్కడి నుంచి గండిపేటకు తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గండిపేటలో బటన్ నొక్కితే మూసీలోకి మంచినీరు వచ్చే ప్రణాళికకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని తెలిపారు. గత 75 ఏండ్లలో కాని అభివృద్ధి ఈ తొమ్మిదిన్నరేండర్ల జరిగిందని అన్నారు. అదేవిధంగా నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, హిందువులు, ముస్లింలు, కులం, మతం ఏదైనా కలిసికట్టుగా జీవిస్తున్నారరని అన్నారు. మనం గణేశ్ నిమజ్జనం చేసుకుంటుంటే ముస్లింలు తమ మిలాద్-ఉన్-నబీ ఊరేగింపును రెండు రోజులు వాయిదా వేసుకున్నారని, మతసామరస్యానికి, గంగా జమునా తహజీబ్కు హైదరాబాగ్ ప్రతీకగా నిలుస్తున్నదని చెప్పారు. నగరంలో ఇటీవల 30 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణి చేశామని, మరో వారం పది రోజులో 40 వేల డబుల్ బెడ్రూంమ్ ఇండ్లను అందజేస్తామని తెలిపారు.