జీవశాస్ర్తాలు, ఔషధ రంగంతోపాటు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ చర్యల ఆవశ్యకతను గుర్తించడంలో తెలంగాణ ముందున్నది. ఇందుకు అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసి ప్రోత్సహించేందుకు హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ, మెడ్టెక్ పార్క్ విస్తరణ, ప్రపంచం లోనే అతిపెద్ద ఫార్మాసిటీ అభివృద్ధికి చర్యలు తీసుకొంటున్నాం.
-మంత్రి కేటీఆర్
Bio Asia 2023 | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): లైఫ్సైన్సెస్ (జీవశాస్ర్తాలు) పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ రంగంలో తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్గా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, 2030 నాటికి రాష్ట్రంలో లైఫ్సైన్సెస్ రంగం విలువ 250 బిలియన్ డాలర్లు దాటుతుందని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక బయో ఏషియా 20వ సదస్సును శుక్రవారం మంత్రి కేటీఆర్ హెచ్ఐసీసీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బయో ఏషియా సదస్సు తెలంగాణతోపాటు భారతదేశంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని అన్నారు. వందకుపైగా దేశాలకు చెందిన ఆరోగ్య సంరక్షణ, ఔషధ, జీవశాస్ర్తాల రంగ అధిపతులను ఈ వేదిక ఒకే చోటికి చేరుస్తున్నదని తెలిపారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్-షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యుమనైజ్డ్ హెల్త్కేర్’ అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ సదస్సు 26 వరకు జరుగనున్నది. మావవాళి శ్రేయస్సుకోసం సహకార స్ఫూర్తితో కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను వివరించేందుకు ఈ థీమ్ను ఎంపికచేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరస్పర సహకారం ఎంత ముఖ్యమో, ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉంటుందో కొవిడ్-19 మహమ్మారి నిరూపించిందని అన్నారు. జీవశాస్ర్తాలు, ఔషధ రంగంతోపాటు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ చర్యల ఆవశ్యకతను గుర్తించడంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని చెప్పారు. ఇందుకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రోత్సహించేందుకు హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ, మెడ్టెక్ పార్క్ విస్తరణ, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ అభివృద్ధికి చర్యలు తీసుకొంటున్నామని వెల్లడించారు. తాము నిర్మించిన ఈ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అమలుచేస్తున్న ప్రగతిశీల విధానాలతో తెలంగాణతోపాటు మొత్తం దేశానికి, ప్రపంచానికి మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం విలువను ప్రస్తుతమున్న 50 బిలియన్ డాలర్ల నుంచి 2030నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచాలని గతంలో లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికీ, 2022లోనే 80 బిలియన్ డాలర్లకు చేరిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ సగటు వృద్ధి 14 శాతం ఉంటే, తెలంగాణలో 23 శాతం నమోదైందని, దీనిని బట్టి 2025 నాటికే తాము 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకొంటామని తెలిపారు. 2030 నాటికి తెలంగాణ లైఫ్సైన్సెస్ ఎకో సిస్టం విలువ 250 బిలియన్ డాలర్లు దాటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గడచిన ఏడేండ్లలో తెలంగాణ మూడు బిలియన్ డాలర్లకంటే ఎక్కువ నికర కొత్త పెట్టుబడులను ఆకర్షించిందని, తద్వారా 4.5 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టించామని వెల్లడించారు. జీవశాస్ర్తాల రంగంలో తెలంగాణ సాధించిన వృద్ధికి ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల ప్రయాణంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి వరకు లైఫ్ సైన్సెస్ కంపెనీలకు సేవలందిస్తున్నాం. ఇందులో టాప్-10 ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. ఆర్ అండ్ డీతోపాటు సాంకేతిక భాగస్వాములైన అరగెన్, సాయి, సింజెన్, డెలాయిట్,యాక్సెంచర్, టెక్ మహీంద్రా వంటి అనేక సంస్థల సహకారంతో ఇది సాధ్యమైంది. ప్రపంచంలోని టాప్-10 ఇన్నోవేటర్ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్లో ఉన్నాయి. ఇవి కోర్ ఆర్ అండ్ డీ, డిజిటల్, ఇంజినీరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి సేవలు ప్రపంచవ్యాప్తంగా రోగుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన చికిత్సలు, వైద్య పరికరాలను సరసమైన ధరకే అందుబాటులోకి తెచ్చేందుకు దోహదం చేస్తున్నాయి’ అని వివరించారు. తమ ప్రయాణం ఇంతటితో ఆపబోమని చెప్పారు. ‘మీరు జీవితంలో ఎక్కడ ఉన్నా సరే, ఇంకా ప్రయాణం మిగిలే ఉంటుంది’అన్న నెల్సన్ మండేలా మాటలను కేటీఆర్ గుర్తుచేశారు. తమ లక్ష్యాన్ని సాధించేందుకు నాలు అంశాలు దోహదం చేస్తాయని తెలిపారు.
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం విలువను ప్రస్తుతమున్న 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచాలని గతంలో లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికీ, 2022లోనే 80 బిలియన్ డాలర్లకు చేరింది. జాతీయ సగటు వృద్ధి 14 శాతం ఉంటే, తెలంగాణలో 23 శాతం నమోదైంది. దీనిని బట్టి 2025 నాటికే మేము 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకొంటాం. 2030 నాటికి తెలంగాణ లైఫ్సైన్సెస్ ఎకో సిస్టం విలువ 250 బిలియన్ డాలర్లు దాటుతుంది.
దేశీయ ఔషధ ఉత్పత్తిలో తెలంగాణ వాటా 40 శాతం కాగా, 1000 కన్నా ఎక్కువ లైఫ్సైన్సెస్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇంకా వీటి సంఖ్య మరింత వృద్ధి చెందుతున్నదని తెలిపారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 200 ఎఫ్డీఏ అనుమతులు పొందిన ఔషధ తయారీ కంపెనీలున్నాయి. ఇవి ఇన్నోవేటర్, జెనరిక్ ఔషధాలను ఉత్పత్తిచేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద, స్థిరమైన ఇంటిగ్రేటెడ్ ఫార్మా పార్క్ ఫార్మాసిటీ ప్రారంభమైతే మా తయారీ సామర్థ్యం మరింత బలోపేతమవుతుంది. చిన్న కంపెనీలతోపాటు అధునాతన చికిత్సా పద్ధతుల వైపు కూడా వేగంగా ముందుకు సాగుతున్నాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, శాంతా బయోటెక్, అరబిందో, హెటిరో, గ్లాండ్ ఫార్మా, విర్చో బయోటెక్ వంటి ప్రధాన కంపెనీలతో బయోలాజికల్ ఉత్పత్తిలో హైదరాబాద్ నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇక్కడ బయోఫార్మా హబ్ (బీ-హబ్)ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రోత్-ఫేజ్ సెంటర్. దేశంలో తయారీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది’ అని పేర్కొన్నారు. కొత్తతరం క్యూరేటివ్ థెరపీలను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చేందుకు సెల్, జీన్ థెరపీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యూరేటివ్ మెడిసిన్ను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు.
లైఫ్ సైన్సెస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్ అత్యంత కీలకంగా మారుతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రంగంలోని నోవార్టిస్, బేయర్, మెడ్ట్రానిక్, థర్మోఫిషర్, ష్రోడింగర్, బీఎంఎస్, సనోఫీ తదితర ప్రముఖ కంపెనీలు తమ ఆర్ అండ్ డీ, అనలటిక్స్, ఇన్నోవేషన్, ఇంజినీరింగ్ బృందాల ద్వారా ప్రపంచానికి అవసరమైన సేవలను అందిస్తాయని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో ప్రపంచంలోని ప్రముఖ లైఫ్సైన్సెస్ కంపెనీలకు హై-ఎండ్ జీసీసీ గమ్యస్థానంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇవి లైఫ్సైన్సెస్ విలువ గొలుసు (వ్యాల్యూ చైన్)ను మరింత పటిష్ఠం చేసేందుకు దోహదపడతాయని తెలిపారు. అధునాతన మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాలు, ప్రపంచస్థాయి ప్రతిభావంతులు ఇందులో కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
జీనోమ్ వ్యాలీలో 30 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ బహుళ సౌకర్యాలు గల స్పేస్ ఉన్నది. నైపుణ్యంగల మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు ఇక్కడ కొలువుదీరాయి. దేశీయ, అంతర్జాతీయ ఔషధ పరిశోధనా సంస్థలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నది.
సాంకేతికత జీవితాలను మార్చేయగలదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగమనం వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనికి టెక్నాలజీ కంపెనీల్లోని ఇంజినీరింగ్, ప్రాడక్ట్ టాలెంట్తోపాటు డీప్ లైఫ్సైన్సెస్ విజ్ఞానం తోడైతే ఫలితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ను హెల్త్-టెక్ మక్కాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని వెల్లడించారు. వివిధ ఇంక్యుబేటర్ ప్రోగ్రాంల ద్వారా హెల్త్కేర్, టెక్నాలజీ కలయికకు సంబంధించిన స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామని, ఇందులో కొన్ని గ్లోబల్ హెల్త్-టెక్ యూనికార్న్లుగా ఉద్భవించే అవకాశం ఉన్నదని చెప్పారు. ‘అద్భుతమైన మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ, ప్రపంచస్థాయి ప్రతిభ తదితర అంశాలు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ లైఫ్సైన్సెస్ కంపెనీలకు అత్యంత విశ్వసనీయ, స్థిరమైన, సురక్షితమైన గమ్యస్థానంగా మార్చాయి. ముఖ్యంగా కొవిడ్ సమయంలో మొత్తం ప్రపంచానికి కొవిడ్, నాన్-కొవిడ్ మందులు, వ్యాక్సిన్లను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ఈ ఎకో సిస్టం దోహదపడింది’ అని వివరించారు. బయోఏషియా -2023 అందరికీ కొత్త అవకాశాలను తెస్తుందని పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్, నోవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధికి ఆసియాలోనే హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గుర్తింపు తెచ్చుకొన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టంను మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘జీనోమ్ వ్యాలీలో 30 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ బహుళ సౌకర్యాలుగల స్పేస్ ఉన్నది. నైపుణ్యంగల మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు ఇక్కడ కొలువుదీరాయి. దేశీయ, అంతర్జాతీయ ఔషధ పరిశోధనా సంస్థలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నది. ఇక్కడి సంస్థలు మెడిసినల్ కెమిస్ట్రీ, డిస్కవరీ బయాలజీ, ప్రీ-క్లినికల్, క్లినికల్, డ్రగ్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్ తదితర సేవలు అందిస్తున్నాయి. వందకుపైగా ఔషధ కంపెనీలు సీఆర్వో సేవలను ఉపయోగించుకొంటున్నాయి. నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఆర్ అండ్ డీ కేంద్రంగా హైదరాబాద్ ఎదిగింది’ అని వివరించారు.