హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కేవలం హైదరాబాద్ మహా నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ కార్యకలాపాల్ని విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఐటీ కంపెనీలను కోరారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ వంటి టైర్-2 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టిందని తెలిపారు. కాబట్టి ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను ఈ నగరాల నుంచి సులభతరంగా కొనసాగించవచ్చన్నారు. హైటెక్ సిటీలోని ఎల్అండ్టీ మెట్రో భవనంలో ఎల్టీఐ మైండ్ట్రీ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో వెయ్యి మందికిపైగా ఉద్యోగులు పనిచేయడానికి వీలున్నది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్న పట్టణాల నుంచి వచ్చే యువతలో ఎంతో నైపుణ్యం, సృజనాత్మకత ఉంటుందన్నారు. వారంతా బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లేందుకు ఇష్టపడనందున వారికి చేరువైన నగరాల్లోనే బ్రాంచీలను తెరవాలన్నారు. దీనివల్ల నైపుణ్యమున్న యువతకు మేలు జరగడంతోపాటు ఆయా కంపెనీలకూ మానవవనరులు లభిస్తాయన్నారు.
హైదరాబాద్లో మౌలిక వసతుల అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. నిజాంపేట నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఈబీఆర్టీఎస్) అభివృద్ధి చేయనున్నట్టు కేటీఆర్ చెప్పారు. అయితే ఇందుకు రెండేండ్ల సమయం పడుతుందన్నారు. కాగా, ఐటీ కారిడార్లో మరో రెండు ఫ్లైఓవర్లను త్వరలో ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజా రవాణాను వినియోగించుకోవాలంటూ ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ఎల్అండ్టీ భవనంలోని భాగస్వాములు ముందుకొస్తే రహేజా ఐటీ పార్కు దగ్గర నిర్మించినటువంటి స్కైవాక్ను నిర్మించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎల్టీఐ మైండ్ట్రీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నచికేత్ దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ చాలా ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలున్నాయని, అక్కడి యువతలో ప్రతిభకు కొదవే లేదని కేటీఆర్ ఐటీ రంగ పెద్దలకు తెలియజేశారు. మరింత ఉత్సాహంతో తమను తాము నిరూపించుకోవాలని వారంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. కనుక వారికి అవకాశాలివ్వాలన్నారు. ముఖ్యంగా కంపెనీలు చిన్న పట్టణాల్లో కార్యకలాపాల్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను పొందాలన్నారు.