హైదరాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) యూనిట్ను తిరిగి పునరుద్ధరించాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమల 1996 నుండి మూసివేయబడింది. గురువారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై గతంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించినప్పటికీ ఎటువంటి పురోభివృద్ధి లేదన్నారు.
ఆదిలాబాద్లోని సీసీఐ యూనిట్ 1984 లో రూ.47 కోట్ల పెట్టుబడితో వ్యయంతో ప్రారంభమైంది. ఈ ప్లాంట్ ఆదిలాబాద్ పట్టణ శివార్లలో 772 ఎకరాలలో విస్తరించి ఉంది. 400 క్వార్టర్స్తో 170 ఎకరాల్లో టౌన్షిప్ ఉందని మంత్రి చెప్పారు. ఈ ప్లాంట్ మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణలోని మరాట్వాడ, విదర్భ ప్రాంతాలలో సిమెంట్ అవసరాలను తీర్చిందన్నారు. బీఐఎఫ్ఆర్ మంజూరు చేసిన పథకం ప్రకారం వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం ప్లాంట్ కార్యకలాపాలు ఆగిపోయాయని తెలిపారు. 2008 లో ఉద్యోగులకు వీఆర్ఎస్ అందించడం ద్వారా ప్లాంట్ మూసివేయబడిందని చెప్పారు. అయితే ఈ విషయమై ఉద్యోగులు కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.
ప్లాంట్కు దాదాపు 1500 ఎకరాల్లో లైమ్స్టోన్ మైనింగ్స్ ఉన్నాయన్నారు. 48 మిలియన్ టన్నుల సున్నపురాయి నిక్షేపాలను పరిశ్రమ కలిగి ఉందన్నారు. ఈ యూనిట్లో 32 కేవీఏ విద్యుత్ సరఫరా కనెక్షన్ కూడా ఉందన్నారు. ప్లాంట్ కోసం నీటి లభ్యత ఇప్పటికీ ఉందని తెలిపారు. అవసరమైన నాణ్యమైన బొగ్గు సింగరేణి కాలరీస్ కార్పొరేషన్ లిమిటెడ్, ప్రభుత్వ యాజమాన్యంలోని బొగ్గు గనుల సంస్థతో అందుబాటులో ఉందన్నారు. దీనిని కాస్ట్-ప్లస్ ప్రాతిపదికన సరఫరా చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.
వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా యూనిట్ను పునరుద్ధరించడానికి మీ సారథ్యంలో చర్యలు ప్రారంభించాల్సిందిగా తాము కోరుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో అవసరమైన అన్ని సహాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.