హైదరాబాద్, మే 25(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) రెండు యూనిట్లకు సంబంధించిన బాయిలర్ను గత వారం ఇంజినీర్లు ప్రారంభించిన విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించేలా చేయాలన్న కేసీఆర్ దృఢ సంకల్పానికి, దార్శనికతకు ఈ ప్లాంటు నిలువెత్తు నిదర్శనమని శనివారం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ప్లాంటు సామర్థ్యం 4,000 మెగావాట్లు అని, దేశంలోనే ఓ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద ప్లాంటు ఇదేనని చెప్పారు. ఇది దేశ చరిత్రలో అసమానమైన విజయగాథ అని కేటీఆర్ వివరించారు.