హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ దేశంలో ప్రజా పారిశుధ్య నిర్వహణ గతిని మార్చిన గొప్ప వ్యక్తి అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొనియాడారు. టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఆయన సేవలను బుధవారం కేటీఆర్ ట్విట్టర్లో గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు బిందేశ్వర్ పాఠక్కు కేటీఆర్ నివాళులర్పించారు. కేవలం సులభ్ ఇంటర్నేషనల్ ద్వారా బహిరంగ మలవిసర్జనపై పోరాడటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రతను బిందేశ్వర్ ప్రోత్సహించారని ప్రశంసించారు. అపహాస్యం నుంచి ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకోవడం వరకు చేసిన ప్రయాణం ఆయన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు.