హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఏడాది క్రితం ఒప్పందం చేసుకొన్నట్టుగా కిటెక్స్ సంస్థ రాష్ట్రంలో అడుగుపెడుతున్నది. శనివారం వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో కిటెక్స్ యూనిట్కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,000 కోట్లతో ఏర్పాటుచేస్తున్న కేరళకు చెందిన ఈ కంపెనీ తెలంగాణకు రావడం వెనుక ఎన్నో ఆసక్తికర పరిణామాలు జరిగాయి.
కిటెక్స్ను ఒప్పించడంలో మంత్రి కేటీఆర్ ప్రదర్శించిన మెరుపువేగం, సమయస్ఫూర్తి కీలకపాత్ర పోషించాయి. కేవలం వారం రోజుల్లో జరిగిన పరిణామాలు కిటెక్స్ను ఇక్కడకు రప్పించాయి. వాస్తవానికి కిటెక్స్ గ్రూప్ కొచ్చిలో రూ.3,500 కోట్లతో మెగా ప్రాజెక్టును స్థాపించేందుకు 2020 జనవరిలో కేరళ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకొన్నది. అయితే వామపక్ష ప్రభుత్వం సోదాల పేరుతో తమను వేధిస్తున్నదన్న కారణంతో ఆ పెట్టుబడిని ఇతర రాష్ర్టాలకు తరలిస్తామని 2021 జూలై మొదట్లో కంపెనీ చైర్మన్ ఎం జాకబ్ ప్రకటించారు. దీంతో కర్ణాటక, తమిళనాడు, ఏపీ సహా దాదాపు 10 రాష్ర్టాలు ఆయనను సంప్రదించాయి. నాటి కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప స్వయంగా జాకబ్తో మాట్లాడారు.
ఇక్కడే మంత్రి కేటీఆర్ చాణక్యం ప్రదర్శించారు. మెరుపువేగంతో నిర్ణయాలు తీసుకొన్నారు. ముందుగా జాకబ్తో పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడారు. తర్వాత కేటీఆర్ రంగంలోకి దిగి జాకబ్కు రాష్ట్రంలోని అనుకూలతలను, పాలసీలను క్లుప్తం గా వివరించారు. ‘ఒకసారి రాష్ట్రానికి రండి. పారిశ్రామిక వాతావరణం చూడండి. మా ప్రభుత్వం ఎంత ప్రో యాక్టివ్గా ఉన్నదో గమనించండి. తర్వాత మీ నిర్ణ యం చెప్పండ’ని ఆహ్వానించారు. అయినా జాకబ్ ఆసక్తి చూపలేదు. దీంతో కేటీఆర్ ‘మా ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నదో చూడడానికైనా తెలంగాణకు రండి. ప్రత్యేక విమానం పంపిస్తా. డేట్స్ చెప్పండ’ని కోరారు. దీంతో జాకబ్ ఆశ్చర్యపోయారు. ఒక పరిశ్రమ కోసం ప్రభుత్వం విమానాన్ని పంపడం ఏంటి? అని ఆలోచించారు. కేరళ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వ్యత్యా సం అర్థమైంది. ‘తెలంగాణకు వస్తాను. నిర్ణయం మా త్రం తర్వాత చెప్తా’ అంటూ జాకబ్ అంగీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో కిటెక్స్ బృందం 2021 జూలై 9న హైదరాబాద్కు వచ్చింది. ఐటీసీ కాకతీయ హోటల్లో మంత్రి కేటీఆర్ వారితో సమావేశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని నిపుణులైన మానవ వనరులు, టెక్స్టైల్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి, రాష్ట్రంలో సాగవుతున్న నాణ్యమైన పత్తి తదితర అంశాలను ప్రస్తావించారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి టీఎస్ఐపాస్ నిబంధనల ప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దానికి తగినట్టుగానే రాయితీలు, ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. చర్చల తర్వాత కూ డా జాకబ్ బృందం నుంచి పూర్తిస్థాయి సానుకూలత రాకపోవడంతో కేటీఆర్ మరో మాస్టర్ప్లాన్ వేశారు. అప్పటికప్పుడు హెలికాప్టర్ సిద్ధం చేసి, వారిని వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు పంపించారు. ఆ పార్కును చూసి హైదరాబాద్కు తిరిగొచ్చిన బృందం మంత్రి కేటీఆర్ను కలుస్తామని సమాచారం ఇచ్చింది. నేరుగా ప్రగతిభవన్కే రండి అంటూ మంత్రి కేటీఆర్ వారిని సీఎం క్యాంప్ ఆఫీస్కు ఆహ్వానించా రు. అక్కడ కిటెక్స్ బృందం తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కేటీఆర్ చొరవను ప్రశంసించింది. తెలంగాణ విధానాలు నచ్చాయని, తాము రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్ట్టు ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులూ పెడతామని హామీ ఇచ్చింది.
చిన్న పిల్లల దుస్తుల విభాగంలో ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న కిటెక్స్ గ్రూప్ది 50 ఏండ్ల చరిత్ర. కేరళకు చెందిన ఎంసీ జాకబ్ 1968లో ఎర్నాకుళం జిల్లా కిజకంబళంలో ‘అన్నా కిటెక్స్ గ్రూప్’ను స్థాపించారు. మొదట్లో అల్యూమినియం ఉత్పత్తులతో ప్రారంభమైన వ్యాపారం మసాలాలు, టెక్స్టైల్స్, స్కూల్, ట్రావెల్ బ్యాగ్స్ తదితర రంగాల్లోకి విస్తరించింది. 1992లో ఎంసీ జాకబ్ కొడుకు సాబు ఎం జాకబ్ ‘కిటెక్స్ గార్మెంట్స్’ను స్థాపించారు. ‘లిటిల్స్టార్’ బ్రాండ్ పేరుతో చిన్న పిల్లల దుస్తులను తయారు చేస్తున్నారు. కంపెనీ ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 4.32 లక్షల యూనిట్లు. ఏటా సుమారు రూ.15 వేల కోట్ల ఎగుమతులు చేయగలదు. కేరళలోని కిటెక్స్ గార్మెంట్స్లో ప్రస్తుతం 11 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఏటా సుమారు రూ.150-160 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నది.