Minister KTR | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధించిన జల విజయగాథలను ప్రపంచ వేదికపై చాటేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో నిర్మాణమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు సాధించిన విజయాలను వివరించనున్నారు. అమెరికాలోని నెవడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్సీఈ)- వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. 2017లో అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఏఎస్సీఈ సదస్సులో సైతం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికల గురించి కేటీఆర్ వివరించారు.
భారీ సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలు, మిషన్ భగీరథ వంటి బృహత్ పథకాలపై నాడు కేటీఆర్ వివరించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తంచేసిన ఏఎస్సీఈ ప్రతినిధులు ఆ తర్వాత 2022లో తెలంగాణలో పర్యటించడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రత్యేకంగా సందర్శించిన ఏఎస్సీఈ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు గేమ్ చేంజర్ అని ప్రశంసించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే పూర్తి చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన అమెరికన్ సివిల్ ఇంజినీర్స్ సొసైటీ సంస్థ ఆ విజయగాథను, తెలంగాణ ప్రభుత్వ ఘనతను అమెరికాలో వివరించేందుకు రావాలని మంత్రి కేటీఆర్ను ఆహ్వానించింది.
సామాజిక, ఆర్థిక ప్రగతిపై..
అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్ ఇంజినీర్ల సమక్షంలో మంత్రి కేటీఆర్ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని ద్వారా అందుతున్న ఫలాలు, ఇతర ప్రణాళికలపై కేటీఆర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వచ్చిన సామాజిక, ఆర్థిక ప్రగతిని వివరించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీటి రంగంలో సాధించిన విజయాలను ప్రపంచ వేదికపై వివరించే అవకాశం దకడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ, ఇవాళ పచ్చని పంటలతో కలకలలాడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ నేలపై ఉన్న మమకారం, అపారజ్ఞానం, ముందుచూపే కారణమని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు. ఈ నెల చివరి వారం వరకు కొనసాగే పర్యటనలో భాగంగా పలు అమెరికన్ కంపెనీలు తమ పెట్టుబడులు ప్రకటించే అవకాశం ఉన్నది.