Minister KTR | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్కు ఈ నెల 17న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు శంకుస్థాపన చేస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పార్క్ శంకుస్థాపనపై చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్ల చుట్టుముట్టు ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే విధంగా కొడకండ్లలో సిరిసిల్ల తరహాలో టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించామన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వారు అందుకు అవసరమైన అనుమతులు ఇచ్చారన్నారు. సిరిసిల్ల తరహాలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఇక్కడి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించామన్నారు. కొడకండ్ల పార్క్ ఏర్పాటుతో ప్రజల కష్టాలు తీరనున్నాయని మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మహిళలు ఇటీవలే కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్నారని దయాకర్ రావు తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలను వచ్చే ఆగస్టు నెల నుంచి కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో 3వేల మంది మహిళలకు కుట్టులో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఆగస్టు నెల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్స్టైల్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్, డైరెక్టర్ మెహర్, యంగ్ ఇండియా, కిటెక్స్, తదితర కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.