జనగామ : జిల్లా పరిధిలోని కొడకండ్ల మండల కేంద్రంలో టెక్స్టైల్ పార్కుకు త్వరలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్కు కోసం గురువారం కొడకండ్లలోని ప్రభుత్వ గిడ్డంగుల వద్ద ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రంలో త్వరలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
టెక్స్టైల్ పార్కు కోసం మొత్తం 50 నుంచి 70 ఎకరాలు అవసరమని ప్రస్తుతం 29 ఎకరాలు అందుబాటులో ఉన్నదని చెప్పారు. మిగతా స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నామని పార్కు ఏర్పాటు పనులను టీఎస్ఐఐసీకి అప్పగించి వెంటనే ప్రారంభించేలా ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పార్కు పూర్తయితే జిల్లాలో వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని, వలస వెళ్లిన వారు స్వంత గ్రామాలకు తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పది రోజులలోపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలిపారు. కలెక్టర్ వెంట టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్కుమార్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ కృష్ణవేణి, ఎంపిపి ధరవత్ జ్యోతి, సర్పంచ్ పసునూరి మధుసూదన్, ఏఎంసీ డైరెక్టర్ కుందూరు అమరేందర్రెడ్డి, తహసీల్దార్ చంద్రమోహన్, తదితరులు ఉన్నారు.