KTR | కేసీఆర్ అంటే సంక్షేమం అని.. మోదీ అంటే సంక్షోభం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభా కార్యక్రమం నిర్వహించనుండగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ప్రతినిధుల సభల నిర్వహణకు సంబంధించి సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ.. పార్టీ శ్రేణులకు ఓ గొప్ప అవకాశమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ ప్రస్థానాన్ని ప్రజలకు మరోసారి వివరించేందుకు, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
మొదటిసారిగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించబోతున్న ప్రతినిధుల సభ వచ్చే ఎన్నికలకు ఓ శంఖారావంలాంటిదని పేర్కొన్నారు. కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపడంతోపాటు సీఎం కేసీఆర్ సారథ్యంలో పార్టీ అద్భుతమైన హ్యాట్రిక్ విజయం సాధించేందుకు సభల ద్వారా బలమైన పునాది రాయి వేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు బీజేపీ అన్యాయాలు, మోసాలు, వైఫల్యాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేలా సభలు నిర్వహించాలని సూచించారు. తెలంగాణ తొమ్మిదేళ్ల ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ ఉజ్వల ప్రయాణాన్ని సభల్లో సమగ్రంగా చర్చించేలా ప్రసంగాఉల, రాజకీయ తీర్మానాలుండాలని ఆదేశించారు. 25న అన్ని నియోజకవర్గాల్లో జరిగే నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు.
పార్టీ ప్రతినిధుల సభకు నియోజకవర్గంలో 3వేల నుంచి 3500 మందిని ఆహ్వానించాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా 4లక్షల మంది పార్టీ నాయకులను ఇందులో మమేకం చేయాలన్నారు. సభల్లో ఆరు తీర్మానాలపై పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ తెలంగాణకు అడుగడుగునా ఏ విధంగా అన్యాయం చేసిందో ప్రజలకు వివరించేలా తీర్మానాలు చేయాలన్నారు. వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి, విద్య- ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు.
అన్నింటికన్నా ముఖ్యంగా వ్యవసాయరంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి అసాధారణమైందని, యావత్ దేశానికే తెలంగాణ వ్యవసాయ విధానం ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని తీర్మానాల్లో ప్రస్తావించాలన్నారు. అలాగే కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విప్లవం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పునరరుజ్జీవం పోసిన మహాయజ్ఞంపై పార్టీ శ్రేణులతో మాట్లాడించాలని చెప్పారు. కరెంట్ కోతలు, చార్జీల వాతలతో దేశంలోని అన్నదాతలు కుదేలవుతుంటే.. తెలంగాణ రైతన్న దర్జాగా 24 గంటల ఉచిత విద్యుత్ అందుకుంటున్న అపూర్వ సందర్భాన్ని వివరించాలన్నారు. దేశానికి వెన్నుముక రైతన్న అయితే.. ఆ రైతుకు వెన్నుముకగా కేసీఆర్ నిలిచిన విషయంపై సభా వేదికపై చర్చించాలన్నారు.
స్వతంత్ర భారత చరిత్రలో ఏ పాలకుడు ఆలోచించని విధంగా సీఎం కేసిఆర్ అమలుచేసిన రైతుబంధు, రైతు భీమాపై కూడా పార్టీ సమావేశంలో తీర్మానాలు చేయాలని కేటీఆర్ సూచించారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి రైతాంగ సంక్షేమానికి పాటుపడుతుంటే కేంద్ర ప్రభుత్వ మాత్రం నల్ల చట్టాలు తెచ్చి దేశంలోని రైతుల నోట్లో మట్టికొట్టే కుట్రచేసిందని ధ్వజమెత్తారు. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతులు కష్టించి పండించిన ధాన్యం కొనకుండా బీజేపీ అన్నదాతలకు ఏవిధంగా అన్యాయం చేస్తుందో సభలో చర్చించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి, సామాజిక భద్రతకు చేపట్టిన కార్యక్రమాలపై మరో తీర్మానం ప్రవేశపెట్టి చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా పసిపిల్ల వాడి నుంచి పండు ముదుసలి వరకు అందరికీ అందుతున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలపై ప్రత్యేకంగా చర్చ చేయాలని సూచించారు. మహిళా సంక్షేమం, వృద్ధులకు ఆసరా పెన్షన్లు, వికలాంగులకు సంక్షేమ కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపైనే ప్రత్యేకంగా రాజకీయ తీర్మానం ఉండాలని సూచించారు.
సభల్లో విద్యారంగం-ఉపాధి అనే విషయంపై తీర్మానం చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా ప్రసంగాలు ఉండాలని చెప్పారు. గురుకుల పాఠశాలల ద్వారా ప్రతి విద్యార్థిపై రూ.1.25లక్షలు ఖరు చేస్తూ వారి బంగారు భవిష్యత్కు బలమైన పునాది వేస్తున్న ప్రభుత్వ సంకల్పాన్ని పార్టీ వేదికపై ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. గురుకుల పాఠశాలలను ప్రారంభించి, వాటిని జూనియర్ కాలేజీలు, డీగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తీరుపై విస్తృత చర్చ ఉండాలన్నారు. అలాగే ఉపాధి రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక వైపు టీఎస్ ఐపాస్ ద్వారా ప్రైవేట్ రంగంలో వచ్చిన ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించాలన్నారు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి.. దాదాపు 2.30లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న తీరుపైన కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టనన్ని నియామకాలు చేపడుతుంటే.. కొందరు పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ ప్రగతి కోసం అనేక కార్యకలాపాలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వకుండా తెలంగాణ పైన ప్రత్యేకంగా వివక్ష చూపిస్తుందన్న ఆయన.. ముఖ్యంగా మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఐఐఎం, గిరిజన యూనివర్సీటీ వంటి ఉన్నత విద్య సంస్థల ఏర్పాటు వంటి అంశాల్లో అడుగడుగునా చూపిస్తున్న వివక్షపై తీర్మానం చేస్తూ ఎండగాలని సూచించారు. ప్రధాని మోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాటిచ్చారని, ఆ హామీ మేరకు 18 కోట్ల ఉద్యోగాలు కల్పించి ఉంటే రాష్ట్రంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్ చేయాల్సిన అవసరం ఏముంటుందో ప్రతినిధుల సభలో తీర్మానాల ద్వారా బీజేపీని గట్టిగా నిలదీయాలని, రాష్ట్రంలోని యువతకు వాస్తవ పరిస్థితి అర్థమయ్యేలా చర్చించాలన్నారు.
పల్లె- పట్టణ ప్రగతితో గ్రామాల్లో, పట్టణాల్లో సాధించిన సమగ్ర ప్రగతిపై విస్తృతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ప్రగతిపై చర్చించి, ఈ సరికొత్త అభివృద్ధి నమూనాను దేశానికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకతపై సభలో తీర్మానాలు చేయాలని సూచించారు. తెలంగాణ పనితనం ఎలాంటిదో చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులే నిదర్శనమన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఒకప్పుడు దగాపడ్డ పల్లెలు ఇప్పుడు ప్రగతికి చిరునామాగా మారాయని, పట్టణాలు వెలుగురేఖలతో ఎలా విరాజిల్లుతున్నాయో ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఐదో రాజకీయ తీర్మానంగా కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా ఆర్థికంగా చితికిపోతున్నారో ప్రస్తావించాలన్నారు.
పెట్రో ముడిచమురు ధరలు తగ్గుతున్నా, మోదీ హయాంలో చమురు ధరలు మాత్రం పెరిగిపోతున్నాయనే విషయాన్ని స్పష్టంగా చర్చించాలన్నారు. దేశప్రజల నుంచి ఏకంగా 30 లక్షల కోట్లను దోచుకుని దోస్తుల రుణాలు మాఫీ చేస్తున్న కేంద్రం వైఖరిని సభా వేదికలపై ఎండగట్టాలన్నారు. మోదీ హయాంలో పప్పు పిరం, ఉప్పు పిరం, గ్యాస్ పిరం, గ్యాస్పై వేసిన దోశ పిరం అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని, ఇప్పటికే ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ప్రతిబింబించేలా తీర్మానాన్ని రూపొందించాలని సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టి చూసుకుంటుంటే.. మోదీ మాత్రం పిరమైన ప్రధానిగా మారారని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రియమైన ముఖ్యమంత్రి కావాలా..? లేదంటే పిరమైన ప్రధాని కావాలో ప్రతి ఒక్కరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే విషయాన్ని గుర్తు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టిన అంశాలు, విభజన హామీలు, స్దానిక ప్రజలు చేస్తున్న డిమాండ్లపై బీజేపీ వ్యవహరిస్తున్న వివక్షపూరిత వైఖరి వంటి అంశాలపై తీర్మానాలు ఉండాలన్నారు. మహబూబ్ నగర్కు సంబంధించి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేయడం, ఖమ్మం జిల్లాకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చకపోవడం, వరంగల్ జిల్లాకు సంబంధించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సీసీఐ , నిజామాబాద్కి సంబంధించి పసుపు బోర్డు ఏర్పాటు తదితర కీలక హామీలను నెరవేర్చకుండా బీజేపీ చూపిస్తున్న వివక్షపై రాజకీయ తీర్మానాలు చేసి విస్తృతంగా చర్చించాలన్నారు. దాంతో పాటు నియోజకవర్గాల వారీగా కేంద్ర ప్రభుత్వం గతంలో హామీలను (ఉదాహరణకు సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్, నారాయణపేటకు హ్యాండ్ లూమ్ పార్కు ఏర్పాటు, మునుగోడులో ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, భువనగిరిలో ఎయిమ్స్ కార్యకలాపాలపై నిర్లక్ష్యం వంటి అంశాలు) నెరవేర్చకపోవడంపై కేంద్రంలోని బీజేపీపై స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంపై తీర్మానాలు చేయాలని చేయాలన్నారు.
భారత చరిత్రలోనే తొలిసారి సీఎం కేసీఆర్ సారథ్యంలో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై తీర్మానం చేయాలని కేటీఆర్ శ్రేణులకు సూచించారు. ఏ పాలకుడు ఆలోచించని విధంగా తెలంగాణలో అమలుచేస్తున్న దళితబంధు దేశం దృష్టిని ఆకర్షిస్తోందని, ఈ విషయాన్ని ప్రతినిధుల సభలో చర్చించాలని చెప్పారు. రాష్ట్ర అత్యున్నత పరిపాలనా కేంద్రమైన రాష్ట్ర కొత్త సచివాలయ భవనానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకోవడం రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ సమర్పిస్తున్న సమ్మునత గౌరవం అనే విషయాన్ని సైతం వేదికపై చర్చించాలని కోరారు. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందడం, జాతీయ పార్టీగా అవతరించడం ఒక చారిత్రక అవసరమనే విషయాన్ని పార్టీ వేదికపై చర్చించి ప్రజలకు వివరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ దేశానికి ఏ ఎలా ఉపయోగపడే అవకాశం ఉందో పార్టీ ప్రతినిధుల వేదికపై చర్చించాలన్నారు. దేశానికి విజన్ ఉన్న నాయకత్వం కావాలి తప్ప.. రోజూ టెలివిజన్లో ప్రత్యక్షమై ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టే నాయకత్వం కాదనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించేలా తీర్మానం చేయాలన్నారు. కేసీఆర్ అంటే సంక్షేమం, మోదీ అంటే సంక్షోభంగా ప్రజలు భావిస్తున్న అంశాన్ని పార్టీ ప్రతినిధుల సభలో తీర్మానం చేయాలని, వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సర్వ సన్నద్ధం చేసేలా సభలను నిర్వహించాలని నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. అన్నివర్గాల అభిమానాన్ని చూరగొన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని, ఈ ప్రతినిధుల సభలను పెద్దఎత్తున విజయవంతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల సమరానికి బలమైన పునాది వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.