హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సమయంలో పారిశ్రామికరంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రం అమలుచేస్తున్న పాలసీల వల్లనే పెట్టుబడులొస్తున్నాయని, కేంద్రం ఎంతో గొప్పగా చెప్పుకొన్న ప్యాకేజీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,777 కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని, కొత్త పెట్టుబడుల కారణంగా 2,06,911 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు టీ భానుప్రసాద్, జీవన్రెడ్డి, జాఫ్రీ, తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. కరోనా వల్ల ఎమ్మెస్ఎంఈలు మూతపడ్డాయని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలని అనేకసార్లు లేఖలు రాసినా, నిర్మాణాత్మక సూచనలు చేసినా కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీల ఆచూకీ కోసం రోజూ వెదుకుతున్నా.. ఇప్పటివరకు దొరకలేదని ఎద్దేవా చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఏమీ ఇవ్వలేదనీ, జీఈసీఎల్ కింద రూ.5,389 కోట్ల రుణాలు ఇప్పించారని చెప్పారు. ఇది రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో 0001 శాతమని ఎద్దేవా చేశారు. కేంద్రం కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే మేలు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్ సమయంలోనూ కొత్త పెట్టుబడుల వృద్ధిలో ఎలాంటి తగ్గుదల లేదని స్పష్టంచేశారు.
పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం శాసనమండలిలో జీరో అవర్లో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ క్షేత్రస్థాయిలో పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో దాదాపు కోటి 44 లక్షల జనాభా నివసిస్తున్నారని, వాటి ప్రగతికి ప్రభుత్వం ఈ ఏడాది రూ.2,622 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఆ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిపై స్పందించిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
గ్రామీణ కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని, అందుకు ప్రతిపాదనలు రూపొందించినట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. శాసనమండలిలో సభ్యులు గోరటి వెంకన్న, శేరి సుభాష్రెడ్డి, ఎగ్గె మల్లేశం, బాలసాని లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గ్రామీణ, జానపద కళారీతులకు సంబంధించిన సీనియర్ కళాకారులకు అండగా నిలిచేందుకు నెలకు రూ.2,016 చొప్పున, నలుగురు వృద్ధ కళాకారులకు నెలకు రూ.10 వేల చొప్పున ప్రత్యేక పింఛన్ అందజేస్తున్నట్టు వివరించారు. అర్హులైన ప్రతి గ్రామీణ కళాకారుడికి పింఛన్ ఇస్తామన్నారు. తెలంగాణలోనే కవులు, కళాకారులు, సాహిత్యకారులకు తగిన గుర్తింపు లభిస్తున్నదని ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. సాహిత్యంపై పట్టు, మక్కువ, సంపూర్ణ అవగాహన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు.
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత విద్యావలంటీర్ల నియామకంపై నిర్ణయం తీసుకొంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు రూ.80 కోట్లు మంజూరుచేసినట్టు వెల్లడించారు. 2017-18లో రూ.38 కోట్లు, 2018-19లో రూ.49 కోట్లు, 2019-20లో రూ.46 కోట్లు, 2020-21, 2021- 22 విద్యా సంవత్సరాల్లో రూ.80 కోట్ల చొప్పున కేటాయించినట్టు వివరించారు. శాసనసభ్యుడు రఘనందన్రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో మైదానాలు పెద్దగా ఉండటంతో ప్రకృతివనాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడుసార్లు వేతనాలు పెంచారని మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. పిల్లల కోసం ప్రవేశపెట్టిన బాలామృతం పథకాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారని, ఇతర రాష్ర్టాల్లో అమలుచేసేందుకు సహకరించాలని కోరారని తెలిపారు. శాసనసభ్యులు గొంగిడి సునీత, పద్మాదేవేందర్రెడ్డి, హరిప్రియ, మెతుకు ఆనంద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మహిళలు, పిల్లల్లో రక్తహీనతను తగ్గించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకానికి ఇప్పటివరకు రూ.1,110 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.
జనగణనలో భాగంగా బీసీ కులాల జనాభాను లెక్కించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో కేంద్రాన్ని డిమాండ్ చేయడం, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించటం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. మంగళవారం హైదరాబాద్లోని బీసీభవన్లో నిర్వహించిన బీసీ హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ గణన చేపట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవటానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరారు. బీసీ కులగణనపై చేపట్టాలని, అవసరమైతే అసెంబ్లీ తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, కిశోర్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. బీసీల పట్ల సీఎంకు ఉన్న ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు బీసీ కుల గణన కోసం తీర్మానాలు చేయాలని కోరారు. కులగణనపై కేంద్రం ప్రభుత్వం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.