KTR | ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇందిరా చౌక్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు.వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్ ప్రగల్భాలు పలికారని చెప్పారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని అన్నారు. చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ యూరియా కొరత లేదని మండిపడ్డారు. రైతుబంధు అడిగితే.. లాగులో తొడలు విడుస్తానని అంటున్నాడని విమర్శించారు.
రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి లేక ప్రజలు గోసపడుతున్నారని తెలిపారు. బతుకమ్మ చీర లేదు.. కేసీఆర్ కిట్ లేదని విమర్శించారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని బోగస్ మాట చెప్పిండని మండిపడ్డారు. ఫిబ్రవరి 8వ తేదీకి కూడా రైతుబంధు పడలేదని తెలిపారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ ఇస్తామని మోసం చేశాడని అన్నారు. అత్తకు, కోడలికి ఇద్దరికీ రూ.2500 ఇచ్చిండా అని ప్రశ్నించారు. తులం బంగారం, రూ.4వేల పింఛన్, విద్యా భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500, స్కూటీలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చిండని అన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మి ప్రజలు మోసపోయిండని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి అభయహస్తం చూపారని.. అది అభయహస్తం కాదని.. భస్మాసుర హస్తమని అన్నారు. హామీలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడమని స్పష్టం చేశారు. 420 హామీలు అమలయ్యే దాకా ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో అబద్ధాలాడి అయినా గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. మొదటిసారి మోసం చేస్తే తప్పు ఎదుటి వారిదవుతుంది.. రెండోసారి మోసపోతే తప్పు మనది అవుతుందని అన్నారు.