హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం, గ్యాస్ పిరం.. గ్యాస్ స్టవ్ పై వేసిన దోశ పిరం.. అన్నీ పిరం.. పిరం.. జనమంతా గరం.. గరం.. అందుకే అంటున్న ప్రియమైన ప్రధాని మోదీ కాదు.. పిరమైన ప్రధాని మోదీ..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ట్వీట్ చేశారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన అదనపు ఎక్సైజ్ పన్నులు, సెస్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం. కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.