Sukesh Chandrasekhar | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఉద్దేశపూర్వక, నిరాధార ఆరోపణలు చేసిన సుకేశ్ చంద్రశేఖర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే పరువునష్టం కేసు (సివిల్, క్రిమినల్) వేయటంతోపాటు జరిగిన పరువు నష్టానికి పరిహారం కోరనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సుకేశ్ తరఫు లాయర్ అనంత్ మాలిక్ ద్వారా నోటీసు పంపారు. మరోసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దని, ఇప్పుడు చేసినవి తప్పుడు వ్యాఖ్యలు అని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని లేఖ రాసివ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కృష్ణదేవ్ నోటీసులో పేర్కొన్నారు.
తెలంగాణ లెఫ్ట్నెంట్ గవర్నర్కు ఫిర్యాదు పేరుతో రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ సమాజంలో గౌరవ, మర్యాదలు ఉన్న వ్యక్తి అని, తప్పుడు ఆరోపణలతో, ఎలాంటి ఆధారాలు లేకుండా పరువు ప్రతిష్ఠలు దెబ్బతిసేలా పబ్లిసిటీ రావాలనే విధంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. వివిధ రకాల క్రిమినల్ కేసుల్లో జైల్లో ఉన్న వ్యక్తి సమాజంలో గౌరవ మర్యాదలున్న వ్యక్తిపై దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇంతవరకు ఏనాడూ సుకేశ్ను కలవలేదని స్పష్టం చేశారు. అనేక కేసులతో జైల్లో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయటం ద్వారా సమాజం దృష్టి మళ్లించే ఉద్దేశం ఉన్నదని అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీడియాలో ప్రచారం కోసం, మీడియాను తనవైపు తిప్పుకొనేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.
గవర్నర్, లెఫ్ట్నెంట్ గవర్నర్కు తేడా తెలియదా?
సుకేశ్ తప్పుడు ఆరోపణలు, ఆయన న్యాయవాది గవర్నర్కు రాసినట్టుగా చెప్తున్న లేఖ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్నది. ఆ లేఖలో తెలంగాణ గవర్నర్ను లెఫ్ట్నెంట్ గవర్నర్గా సంబోధించారు. తెలంగాణకు గవర్నర్ ఉంటారు కానీ ఆ లేఖలో లెఫ్ట్నెంట్ గవర్నర్ అని రాశారు. వాట్సాప్ యూనివర్సిటీకి గవర్నర్కు, లెఫ్ట్నెంట్ గవర్నర్కు తేడా తెలియదంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడ్డారు. ఈ మాత్రం అవగాహన లేదా? అని సుకేశ్ న్యాయవాది అనంత్ మాలిక్ను ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఆయన బీజేపీ నాయకులు చేసిన ట్వీట్లకు లైక్లు కొడుతున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీన్ని బట్టి సుకేశ్ వెనకాల ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులే ఇలాంటి చిల్లర పనులు చేయిస్తున్నారని నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.