హైదరాబాద్: ఫార్ములా-ఈ రేస్ కేసులో అణాపైసా అవినీతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలిందన్నారు. ప్రొసీజర్ కరెక్ట్గా లేదని మాత్రమే అన్నారని చెప్పారు. ప్రభుత్వం కేసుపై ముందుకు వెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. హెచ్ఎండీఏ ఒక కార్పొరేషన్ అని, హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైన డబ్బులు ఖర్చు చేయవచ్చని తెలిపారు. హెచ్ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని చట్టంలోనే ఉందన్నారు. దానికి ఆ మేరకు స్వతంత్రత ఉందని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేదా ముఖ్యమంత్రే అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారో అర్ధం కావడంలేదని చెప్పారు. తనపై కేసు నిలవడదని స్పష్టం చేశారు. లీగల్గా ముందుకు వెళ్తామని, లంచ్ మోషన్ పిటిషన్పై కోర్టు తేలుస్తుందన్నారు.
ఓఆర్ఆర్ లీజు అంశంలో సిట్ ఏర్పాటుపై కూడా కేటీఆర్ స్పందించారు. టీఓటీ పద్ధతి దేశంలో ఇప్పటికే అమలులో ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు డబ్బును రైతు రుణమాఫీకి ఉపయోగించామని చెప్పారు. ఆర్థిక వనరుల సమీకరణపై అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చింది. ఓఆర్ఆర్ నుంచి డబ్బులు సేకరించవచ్చని సూచించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టీఓటీ తరహాలోనే ఓఆర్ఆర్ లీజు నుంచి డబ్బులను సేకరించాం. ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు ఆరోపిస్తున్న రేవంత్ ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ఓఆర్ఆర్ లీజుపై రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన అడ్డగోలు మాటలపై హెచ్ఎండిఏ పరువు నష్టం కేసు వేసింది. ఇప్పటికీ ఆ కేసు అలాగే ఉంది. ముఖ్యమంత్రి ఓఆర్ఆర్పై అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారు. మరి ఆ లీజును ఎందుకు రద్దు చేయడం లేదన్నారు.
రేవంత్ రెడ్డి మున్సిపల్, హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన పరిధిలో ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి. తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలి. అందుకే ఓఆర్ఆర్ లీజును వెంటనే రద్దుచేసి.. సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరిపించాలి. ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీని కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారు. న్యాయమూర్తి ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తాం.
మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలి. కోకాపేట భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం అంటున్నారు. స్కామ్ అయితే ఆ భూముల అమ్మకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి’ అన్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చి స్పీకర్, ప్రతిపక్ష సభ్యులపైకి వాటర్ బాటిళ్లు, పేపర్లు విసరడం ఎలా అని శిక్షణ ఇచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. దళితుడు అంటూ పదే పదే చెప్పడం స్పీకర్ గౌరవాన్ని తగ్గించేలా చేయడమేనన్నారు.