హైదరాబాద్: రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమార్శించారు. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వేల కోట్లు సంపాదిస్తే.. వందల కోట్లు సంపాదించుకోవడంలో మంత్రులు ఉన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్ అయ్యాయని, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాంత్రం నిల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామిక వేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు ఉద్యోగం చేసుకోలేక చేతులెత్తేసే పరిస్థివి వచ్చిందని మండిపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, మాఫియా రాజ్యమని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ పరిపాలన అవినీతి కంపు రాష్ట్ర వ్యాప్తంగా కొడుతుంది.
తెలంగాణను మేము అగ్రికల్చర్లో అగ్రస్థానంలో నిలిపాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకువచ్చింది. రాజకీయ జీవితంలో ఇంతటి బలహీన ముఖ్యమంత్రిని చూడలేదు.
ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులను ముఖ్యమంత్రి పంపడం, నిందితుని స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని మాయమైపోవడం ఎప్పుడూ చూడలేదు. స్వయంగా ముఖ్యమంత్రి అనుచరుడు, ఆప్తుడు రోహిన్ రెడ్డి బెదిరించారని, తుపాకీ రేవంత్ రెడ్డే ఇచ్చిండని మంత్రి కుమార్తె చెబుతున్నారు. బెదిరించింది వాస్తవమేనని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమంత్రే తుపాకీ ఇచ్చి పంపించాడని ఆరోపణ చేసినప్పుడు, సీఎం సిగ్గు లేకుండా మౌనంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి సిగ్గు ఉంటే కనీసం ఈ అంశంపైన స్పందించాలి. రేవంత్ రెడ్డి వంటి బలహీన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎప్పుడూ చూడలేదు. స్వయంగా నీపైన మంత్రి బిడ్డే ఆరోపణలు చేస్తే ఆ మంత్రినీ పక్కకు జరపలేవు. స్వయంగా నీ మంత్రులు మీపై ఆరోపణలు చేస్తున్నా కనీసం వారిని ముట్టుకోలేని బలహీన ముఖ్యమంత్రివి నువ్వు. సిగ్గు ఉంటే పాలనపై పట్టు నీరూపించుకోవాలి. తన పరిపాలన పైన, మంత్రుల పైన ఎలాంటి పట్టు లేదని తేలిపోయింది. దావూద్ ఇబ్రహీం లాంటి ముఖ్యమంత్రిని తరిమేసుకుంటేనే తెలంగాణకు పట్టిన శని పోతుంది.
కాంగ్రెస్ అవినీతికి ప్రభుత్వ అధికారులు కూడా భయపడుతున్నారు. వీరి వాటాల పంచాయతీలో మాకు భాగస్వామ్యం వద్దు, మాకు సంబంధం లేదంటూ అధికారులు పారిపోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయమని వేధించడం వల్లనే వారు వాలంటరీ (VRS) తీసుకుంటున్నారు. మంచి అధికారులు కూడా పారిపోయేలా చేసే దండుపాళ్యం ముఠా రాష్ట్రంలో ఉంది. దండుపాళ్యం ముఠానే రాష్ట్రాన్ని నడిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రుల దండుపాళ్యం ముఠా రాష్ట్రాన్ని నడిపిస్తున్నది. తను చెప్పిన పని చేయలేదని చెప్పి సీనియర్ ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్ తీసుకుంటే కూడా, ఆయన రాజీనామా ఆమోదించవద్దని జూపల్లి కృష్ణారావు కోరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు భాగస్వాములు అయితే, అధికారులు వత్తాసు పలికితే గతంలో మాదిరి జైలుకు వెళ్లవలసి వస్తుంది. గతంలో మాదిరి అధికారులకు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రుల అవినీతి వాటాల పంచాయితీలకు మీరు దూరం ఉండాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం దాకా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే, మేము వందల కోట్లయినా సంపాదించవద్దా అని మంత్రులు పోటీ పడుతున్నారు. గన్నులు పెట్టి బెదిరించడంతో ఇందిరమ్మ రాజ్యంలో వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు. తెలంగాణలో నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కాదు. స్వయంగా మంత్రి కూతురు చెప్పింది. రాష్ట్రంలో గనకల్చర్ నడుస్తుంది. పారిశ్రామికవేత్త నెత్తిన గన్ను పెట్టి బెదిరించారు అని పోలీసులు వెతుకుతున్న నిందితుడిని అరెస్టు చేయొద్దంటూ మంత్రిగారి కుమార్తె ఆపితే.. స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని వెళ్ళిపోయినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవు. రెండు మూడు రోజులపాటు తిట్టుకొని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరు కలిసి శాలువాలు కప్పుకుని స్వీట్లు పంచుకున్నారు. ఏం ఉద్దరించారని ముఖ్యమంత్రికి శాలువా కప్పి పీసీసీ ప్రెసిడెంట్ సన్మానం చేశాడు. ఇద్దరు మంత్రులు కలిసి ఏం పొడిచారని స్వీట్లు పంచారు. ఇద్దరి మధ్యలో ఏం సెటిల్మెంట్ జరిగిందని ఈ కలరింగ్ ఇచ్చారు. వాటాల పంచాయితీ, అవినీతి సొమ్ముల పంపకాలు, టెండర్ల రిగ్గింగ్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఇంటి పంచాయతీ లెక్క మారిపోయాయి . జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి ఇల్లు సెటిల్మెంట్లకు కేంద్రంగా మారిపోయింది.
రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతుంటే, మంత్రులు, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇంత రాచకం కొనసాగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పరిశ్రమల యజమానులకు తుపాకీలు పెట్టినప్పుడు, వాటాల పంచాయతీతోనే మంత్రులు బజారుకెక్కినప్పుడు, సీనియర్ అధికారులు పారిపోతుంటే.. రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది?. తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తెచ్చింది రోహిన్ రెడ్డి, అక్కడ ఉన్నాడు అని స్వయంగా మంత్రి కుమార్తె చెప్పింది. కానీ పోలీసులు మాత్రం గన్ ఇచ్చింది కొండా మురళి, బెదిరించింది కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ అని చెప్తున్నారు. రెండు అంశాల్లో కూడా బెదిరింపులు గన్నుతో జరిగాయనేది వాస్తవం. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు. పింకు బుక్కులు లేవు, రెడ్ బుక్కులు లేవు, కేవలం కాకీ బుక్కు మాత్రమే రాష్ట్రంలో ఉంటుందని గొప్పలకు పోయిన రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నాడు. మా కార్యకర్తలను జైల్లో పెట్టిన పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చేలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని కొంతమంది పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కన్నా దారుణంగా పనిచేస్తున్నారు. నిజంగా డీజీపీకి నిజాయితీగల పేరు ఉంటే గన్నుల బెదిరింపు వ్యవహారంలో చర్యలు తీసుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. పోలీస్ యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే.. గన్ను తెచ్చింది ఎవరు, గన్ను గురిపెట్టింది ఎవరు అనే విషయాన్ని తేల్చాలి. ఈ అంశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారణ చేసి ఆయన అభిప్రాయాన్ని రికార్డు చేయాలి. సుమంత్ను విచారించి నిజానిజాలు బయటపెట్టాలి. ఈ మొత్తం గన్నుతో గురిపెట్టిన సంఘటనలో కచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి.
పోలీస్ శాఖలో 99 శాతం మంది బాగానే ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. కానీ ఒక్క శాతం మంది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. వారినే మేము ఈరోజు నిందిస్తున్నాం. మంచిరేవుల భూముల కోసం గన్ను పెట్టి బెదిరిస్తున్నారని మంత్రి కూతురు స్వయంగా చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు?. మంత్రులు ఎక్కడ సంతకం పెట్టారో సొంత కుటుంబ సభ్యులకు కూడా తెలవకూడదు అన్న నియమాలు ఉన్నాయి. ఇవన్నీ మంత్రి బిడ్డకు తెలపడం, జపాన్లో ఉన్న ముఖ్యమంత్రి ఫైలు వెనక్కి తెప్పించుకోవడం ఇదంతా ఆరాచకంగా మారింది. ముఖ్యమంత్రి సోదరుడు 15 ఎకరాలు, కొండా సురేఖ 15 ఎకరాలు తీసుకొని మొత్తం 30 ఎకరాల భూమి పంచాయితీ పెట్టుకున్నారు మంచిరేవులలో. ఈ భూమి మొత్తం నాకు కావాలంటే, నాకు కావాలి అని మంత్రి, రేవంత్ రెడ్డి, కొండా సురేఖ కోట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మొత్తం బయటపెట్టుకొని తిరిగి రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ?. గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుక్కలు చింపిన మిస్తరులా చేస్తారు అని. మంత్రులు కాంట్రాక్టులు, కమిషన్ల వ్యవహారాన్ని ఇంటి పంచాయితీగా మార్చారు. పొంగులేటి నా టెండర్లలో తలదూర్చారని మంత్రి కూతురు స్వయంగా చెప్పింది. బెదిరింపులు, టెండర్ల రిగ్గింగు ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడు జరగలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశాను అనే మంత్రి కూతురు చెప్పినప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించరా?. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని దక్కన్ సిమెంట్ కంపెనీ యజమానిపైన గన్ను గురిపెట్టినప్పుడు కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రోహిన్ రెడ్డిని, సుమంత్ను ఎవర్ని కూడా పోలీసులు విచారించలేదు.
ఇంత దారుణంగా బహిరంగంగా అవినీతి అంశంపైకి వచ్చినా, బెదిరింపులు బయటపడినా బీజేపీ నేతలు స్పందించడం లేదు. తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ పరిపాలన నడుస్తున్నది. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, అమిత్ షా వంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా మౌనంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ఏమాత్రం కాపాడలేదని మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పరిపాలనలో పరిపాలన లేదు, ప్రజా పాలన లేదు. కేవలం అరాచకాలు, అవినీతి, బెదిరింపులు, కమీషన్లు, టెండర్ల రిగ్గింగ్ అన్నీ నడుస్తున్నాయి.
వంద రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారని ప్రజలు కాంగ్రెస్ను తిడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, అరాచక పాలనను చూసి అసహ్యించుకుంటున్నారు. చాలా అనుభవజ్ఞుడైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజాన్ని చెప్పారు. ఇంత అరాచకం అవినీతితో కూడిన పరిపాలన ఆయన చూసి ఉండరు. కాబట్టి తెలంగాణలో మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అనే మాట చెప్పారు. ఆయనకి తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని ఆకాంక్షలను వ్యక్తపరిచినందుకు మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము.