హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు జరిపిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ చేసిన రాళ్ల దాడి చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్లో ట్వీట్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నా చైర్మన్ ఎన్నికల్లో కౌన్సిలర్లు పాల్గొనకుండా అడ్డుకొని వాయిదా వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి, అన్యాయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపైనే లాఠీచార్జ్కు దిగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
న్యాయం కోసం నిరసనకు దిగిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్పైనే కేసులు బనాయిస్తామని బెదిరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. జనగామలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ చేతి పైకిఎత్తిన దళిత మహిళా కౌన్సిలర్ పట్ల.. కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించడం చాలా దారుణమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి మున్సిపల్ ఎన్నికల దాకా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైరెక్షన్లో, అడుగడుగునా అరాచక పర్వాన్ని కొనసాగిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.