హైదరాబాద్: హిల్డ్ పాలసీ (HILTP) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నది బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రవేట్ వ్యక్తులకు రేవంత్ సర్కార్ (Revanth Reddy) ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. పరిశ్రమలు వద్దు అంటూ అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నదని ధ్వజమెత్తారు. పారిశ్రామిక భూముల బదలాయింపుపై కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నిజనిర్ధారణ బృందం జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్లో పర్యటించింది. ఈ సందర్భంగా హమాలీలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేటు వ్యక్తుల భూములు కావని, ప్రైవేట్ వ్యక్తులకు ప్రజలు, ప్రభుత్వం ఇచ్చిన భూములన్నారు. అందులో కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇచ్చారని గుర్తుచేశారు. మార్కెట్లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.4000కు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నదని విమర్శించారు.
హైదరాబాద్ నగరంలో ఇండ్లకు, పాఠశాలలు, దవాఖానలు, చివరికి స్మశానాలకు స్థలం లేదు.. కానీ ప్రైవేట్ వ్యక్తులకు 9300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటున్నదని మండిపడ్డారు. ఈ 9300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకొని అక్కడ కాంగ్రెస్ చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూళ్లు, హాస్పిటళ్లు కట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో స్థలం లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఇక్కడ ఉన్న కంపెనీలు తరలి వెళ్తే హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ, దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిర్ధారణ జరగాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ ఇక్కడితో వదిలిపెట్టదని, కాంగ్రెస్ పార్టీ హిల్ట్ పాలసీ కుంభకోణంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని కాలనీల ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తామని తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని చెప్పారు. అనుముల రేవంత్ రెడ్డి కాదని, అవినీతి అనకొండ అని విమర్శించారు. 9300 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఢిల్లీకి మూటలు పంపడానికి చేస్తున్న ఈ స్కామ్ ను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకొని లక్షల కోట్ల విలువచేసే ప్రజల భూమిని కాపాడే దాకా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఈ పాలసీది రద్దు చేస్తామని, అవసరమైతే దీనికోసం ఒక చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే అటు పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంతటి భారీ కుంభకోణాన్ని, దోపిడీని చూసి తట్టుకోలేక తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న తెలంగాణ బిడ్డ మాకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సమాచారం లీక్ అయిందంటూ ప్రభుత్వం బాధపడుతున్నదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీడిమెట్ల ప్రాంతంలో గజానికి మార్కెట్ ధర లక్ష రూపాయలుగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.4000కే భూమిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతామని చెబుతున్నదని విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి ఇది నిదర్శనమన్నారు. భూముల దోపిడీ ఆర్నెళ్లుగా జరుగుతున్నదని, పాలసీ ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవలన్నారు.