హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి బిల్డర్లు, రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసి రూ.2,500 కోట్లు ఢిల్లీకి పంపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ మంత్రిగానూ ఉన్న రేవంత్.. మూడు నెలలుగా బిల్డింగులకు ఎందుకు అనుమతులు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. పైసలిస్తేనే అనుమతులు ఇస్తామంటున్నారని విమర్శించారు. ఈ బెదిరింపుల వార్తలు బయటకు రాకుండా ఫోన్ట్యాపింగ్, స్కాములు అంటూ టీవీ ల్లో ఆ వార్తలను రాయించుకుంటున్నారని చెప్పారు. ఇసుక స్కాంలో ఒక మంత్రి, రైస్మిల్లర్లను ఇంకో మంత్రి బెదిరిస్తున్నారని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్లో హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థాయి పార్టీ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్రెడ్డేనని తెలిపారు. ఇక్కడ రేవంత్ బీజేపీ పాట పాడుతున్నారని, కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా 40 సీట్లు దాటవని ఎద్దేవా చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేయాలి. నీ అధికారం ఉంది కదా. ఏం చేస్తావో చేసుకో. ఎక్కడెక్కడ తప్పులు జరిగినవో, ఎవరెవరు తప్పులు చేశారో వాళ్లపై చర్యలు తీసుకో’ అని సీఎంకు స్పష్టం చేశారు. రేవంత్కు భయపడే వారెవరూలేరని, వెంట్రుక కూడా పీకలేరని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ప్రతిపక్షాలను అరెస్టు చేసేపనిలో ఉన్నారని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళ వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్లో పోటీ ఒక విఫల ఎంపీ కిషన్రెడ్డి, అవకాశవాద ఎమ్మెల్యే దానం నాగేందర్, నిబద్ధత కలిగిన పద్మారావుగౌడ్ మధ్య ఉన్నదని కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోక్సభలో ఇంతవరకు బీఆర్ఎస్ గెలవలేదని, ఈసారి పద్మారావుగౌడ్ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నామని తెలిపారు. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్నవారే నిజమైన కార్యకర్త అని తేల్చిచెప్పారు. రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటే గుర్తుకొచ్చే పేరు పద్మారావుగౌడ్ అని. 24 ఏండ్ల నుంచి పార్టీకి నగరంలో అండగా ఉన్నారని వెల్లడించారు. ఆయన పోటీ చేస్తున్నారని అనగానే పార్టీ గెలుస్తుందని అందరూ చెప్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో 11.50 లక్షల కుటుంబాలకు ఉచితంగా తాగునీటిని ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బిల్లులు వసూలు చేస్తున్నదని విమర్శించారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అని ఇప్పుడు కండీషన్లు పెడుతున్నదని ఆరోపించారు.
దానం నాగేందర్ పార్టీని వదిలిపోయారని, రాజకీయాల్లో హత్యలుండవు, అత్మహత్యలే ఉంటాయని కేటీఆర్ అన్నారు. ఆయన నిర్ణయం తప్పు అని ఎన్నికల్లో గెలిచి మనం చూపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం కోసం ఆశపడి, గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఆయన కాంగ్రెస్లోకి వెళ్లారని తెలిపారు. దానం నాగేందర్పై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అనర్హుడిగా ప్రకటించేలా చేస్తామని స్పష్టం చేశారు. మూడు, నాలుగు నెలల్లోనే ఖైరతాబాద్లో ఉపఎన్నిక వస్తుందని, దానికి సిద్ధంగా ఉండాలని, ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలని అన్నారు.
రాముని పేరుతో బీజేపీ ఆడుతున్న నాటకాలను అందరు గమనించాలని కేటీఆర్ కోరారు. ఈడీ, సీబీఐ, ఐటీని అడ్డంపెట్టుకొని శిఖండి రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డిని ఓడగొట్టి బీజేపీకి మనం సందేశాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. గతంలో అంబర్పేటలో ఓడిపోతే అదృష్టవశాత్తు కిషన్రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ అయ్యారని విమర్శించారు. కురుకురే ప్యాకెట్లు పంచడం, సీతాఫల్మండీలో రైల్వేలిఫ్ట్ ప్రారంభించడం, సింటెక్స్ ట్యాంకులను ఓపెన్ చేయడమే ఆయన కేంద్రమంత్రిగా చేసిన అతిపెద్ద మూడు పనులు అని ఎద్దేవాచేశారు. సొంత నియోజకవర్గం అంబర్పేటలో కేంద్ర నిధులతో కడుతున్న ఫె్లైఓవర్ను ఇంకా నాన్చుతూనే ఉన్నారని, తాము మాత్రం 36 ఫ్లైఓవర్లు పూర్తి చేశామని గుర్తుచేశారు. కిషన్రెడ్డికి దమ్ముంటే లికర్ విధానంలో ఏముందో కోర్టుకు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో విద్యుత్తు, నీటికష్టాలు మొదలయ్యాయని చెప్పారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. పద్మారావుగౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎమ్మెస్ ప్రభాకర్, హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గడ్డం నగేశ్, మన్నె గోవర్ధన్రెడ్డి, దాసోజు శ్రవణ్కుమార్, విప్లవ్కుమార్, శ్రీధర్రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
లంకెబిందెల కోసం దొంగలు తిరుగుతారని సీఎం రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ చురక అంటించారు. ‘పేగులు మెడలో వేసుకుంటా అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నోడు మన ముఖ్యమంత్రి. రేవంత్రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని జేబుదొంగ లెక్క తిరుగుతున్నడు. కరెంటు, రైతుబంధు, మహిళలకు రూ.2,500, రూ.4వేల పెన్షన్లు ఇయ్యడానికి చేతకాదు. ఇవన్నీ కవర్ చేయటం కోసం ఫోన్ ట్యాపింగ్, స్కాములు అంటూ వార్తలు రాయించుకుంటున్నడు’ అని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్కు బీజేపీని ఆపే దమ్ము లేదని కేటీఆర్ తెలిపారు. దేశంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే మోదీని నిలువరిస్తాయని వెల్లడించారు. కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటివారితోనే సాధ్యమని స్పష్టం చేశారు.
పదేండ్ల పాలనలో హైదరాబాద్ను బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఒక రూపాయి కూడా హైదరాబాద్కు అదనంగా తీసుకురాలేదని తెలిపారు. కేసీఆర్ వెంట పనిచేసిన తాము ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని తెలంగాణ సాధించామని గుర్తుచేశారు. కేసీఆర్ చెప్తే సికింద్రాబాద్లోనే కాదు ఢిల్లీలోనైనా కొట్లాడే దమ్ము తమకు ఉన్నదని తేల్చిచెప్పారు. అదీ తమకు కేసీఆర్పై ఉన్న నమ్మకం అని స్పష్టం చేశారు. అంతపెద్ద తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన తమకు ఈ లోక్సభ ఎన్నికలు ఒక లెక్క కాదని అన్నారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అధికంగా సీట్లు కేటాయించిందని వెల్లడించారు.