KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రోడ్షో శుక్రవారం నుంచి యథావిధిగా కొనసాగనున్నది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలు పాటు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడొద్దని సూచించింది.
అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మీడియాల ద్వారా ఎక్కడా ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని చెప్పింది. మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్ బస్యాత్ర వద్దకు చేరుకొని ఉత్తర్వులు అందజేశారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు బుధవారం రాత్రి 8 గంటలకు ముందుగానే కేసీఆర్ ముగించుకొని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని నివాసానికి వెళ్లిపోయారు.
షెడ్యూల్ ప్రకారం.. మహబూబాద్లో రోడ్షో నిర్వహించి.. వరంగల్లో బస చేయాల్సి ఉంది. వరంగల్ నుంచి తొమ్మిదో రోజు గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రోడ్ షో నిర్వహించి.. వీణవంకలో బస చేయాల్సింది. ఎన్నికల సంఘం విధించిన గడువు ముగిసిన అనంతరం శుక్రవారం నుంచి కేసీఆర్ యథావిధిగా రోడ్షో నిర్వహించనున్నారు. శుక్రవారం 8 గంటల తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండంలో బస్యాత్ర కొనసాగించి.. అదే రోజు రాత్రి రామగుండంలోనే బస చేయనున్నారు. శనివారం జగిత్యాల జిల్లాలో రోడ్ నిర్వహించి.. అక్కడే బస చేస్తారు.