సూర్యాపేట, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరుగుతున్నది కాదని, గరీబీ గులాబీకి… కార్పొరేట్ కమలానికి మధ్య జరుగుతున్న పోరు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాతీ బాస్ల వద్ద రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం తాకట్టు పెట్టడం వల్లనే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. కేంద్రంలో ఎనమిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలండర్ ధర రూ.1200 లకు వచ్చిందని.. మునుగోడులో రాజగోపాల్రెడ్డిని గెలిపిస్తే ప్రజలు తమను ఆమోదించారనే భావనతో వెంటనే సిలిండర్ ధరను రూ.2,400 చేయడం ఖాయమని పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్కు ఏమాత్రం విలువలు లేవని విమర్శించారు. తమ్ముడు రాజగోపాల్రెడ్డి మూడున్నరేండ్లు కాంగ్రెస్లో ఉండి, ఆ పార్టీకి మోసం చేసి బీజేపీలో చేరితే.. ఆయన గెలుపు కోసం వెంకట్రెడ్డి కోవర్టుగా మారారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్టుప్పల్లో ఆదివారం ఆయన భారీ రోడ్షో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. దళితుల కోసం అమలు చేస్తున్న దళితబంధు పథకంలాగే త్వరలోనే అన్ని వర్గాల పథకాలు అమలు చేయబోతున్నట్టు చెప్పారు.
రాజగోపాల్రెడ్డి కాంట్రాక్టర్గానే ఉంటారు తప్ప ఆయనకు పాలన చేతకాదని, ప్రజలపై అభిమానం ఉండదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా ఉండి మునుగోడు ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని, ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఉన్న చేనేతల సమస్యలను ఏ ఒక్క రోజూ తన దృష్టికి తీసుకురాలేదని విమర్శించారు. ఇన్నాళ్లు మునుగోడును అనాధగా వదిలేసి ఇప్పుడు తులం బంగారం ఇచ్చి గెలుస్తా అని అంటున్నారని మండిపడ్డారు. బంగారం ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలో తాము వందకు పైనే అంశాలు చెప్తామని, బీజేపీ ఒక్కటైనా చెప్పగలదా? అని ప్రశ్నించారు. ‘చౌటుప్పల్ మీదుగా గట్టుప్పల్ వస్తుంటే పచ్చబడ్డ మునుగోడును చూసి ఎంతో సంతోషమైంది. ఒకనాడు తెలంగాణలో వరి పండేది కాదు.. కానీ నేడు వరి అధికంగా పండించే జిల్లా ఏది అంటే నల్లగొండ అని గల్లా ఎగరేసుకొని చెప్పొచ్చు. రాష్ట్రంలో 2014లో 68 లక్షల టన్నుల ధాన్యం పండిస్తే.. ఈ ఏడాడి మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం వచ్చింది’ అని తెలిపారు.
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాగునీటి మంత్రులుగా ఉన్న పాల్వాయి గోవర్ధన్రెడ్డి, జానారెడ్డి ఫ్లోరైడ్ బాధితులను, సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. నేడు ఇంటింటికి నల్లా పెట్టి ఫ్లోరోసిస్ను శాశ్వతంగా తరిమి కొట్టిన నాయకుడు సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. చర్లగూడెం, శివన్నగూడెం రిజర్వాయర్లు 70 శాతం పూర్తయ్యాయని, ఏడాదిలోపు మొత్తం పూర్తిచేసి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యంత మానవీయ ఆలోచన చేసే నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు పెన్షన్ రూ.200 ఉంటే ఇప్పుడు రూ.2,000 చేశామని తెలిపారు. ఆడబిడ్డ పెండ్లి అంటే ఎంత కష్టమో కేసీఆర్కు తెలుసు అని, అందుకే కల్యాణ లక్ష్మి పేరుతో అద్భుత పథకాన్ని తెచ్చారని చెప్పారు.
ప్రస్తుతం దళితులకు అమలు చేస్తున్న దళితబంధు అన్ని వర్గాలకు అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. వాస్తవానికి కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పుడు ఎస్సీ, ఎస్టీలకు అని చెప్పి తరువాత పేదవారు ఎక్కడున్నా కులాలు, మతాలకు సంబంధం లేకుండా వర్తింపజేశామని గుర్తుచేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని, నాయకున్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి మోసాలు చేసేందుకైనా… అబద్ధ్దాలు అడేందుకైనా వెనుకాడదని విమర్శించారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చేందుకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. గట్టుప్పల్ను కొత్తమండలం చేశామని, అలాగే చండూరును రెవెన్యూ డివిజన్గా చేసే బాద్యత తాను, మంత్రి జగదీశ్రెడ్డి తీసుకొంటామని పేర్కొన్నారు.
రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసి ధర్మం కోసం దేశ కోసం అంటున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అభివృద్ధి చేసే వాళ్ళను గెలిపించుకోండి. కాంట్రాక్టర్ మిమ్మల్ని పట్టించుకోడు… కాంట్రాక్ట్లతో వచ్చిన డబ్బుతో మందు పోసినా, డబ్బులు ఇచ్చినా బరాబర్ తీసుకోండ్రి అవి గుజరాత్ డబ్బులే అన్నారు. ఉప ఎన్నికల్లో కారు గుర్తుపై బలంగా గుద్ది గట్టుప్పల్లో ఏకపక్ష తీర్పు ఇచ్చి గెలిపిస్తే గ్రామంతో పాటు నియోజకవర్గ రూపు రేఖలు మర్చే బాధ్యత నాది, మంత్రి
జగదీశ్రెడ్డిది అన్నారు.