హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో కొంతమందికే అచ్చేదిన్, అమృత్కాల్ వచ్చిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో మిగిలిన వారికి డబుల్ ఇంజిన్ డిజాస్టర్గా మిగిలిందంటూ ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘హంగర్ గ్లోబల్ ఇండెక్స్’లో భారత్ 107వ స్థానానికి దిగజారిన నేపథ్యంలో దేశాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లినందుకు మోదీకి ధన్యవాదాలు అంటూ సెటైర్స్ వేశారు.
చిన్నారి ట్వీట్కు కేటీఆర్ ఫిదా
నాలుగేండ్ల చిన్నారి జాన్టన్ ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోకు మంత్రి కేటీఆర్ ముగ్ధుడయ్యారు. హైదరాబాద్లో చెరువులు, కుంటల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆ చిన్నారి కేటీఆర్కు ట్వీట్ చేశారు. హైదరాబాద్లో తరుచుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, వరదలకు బెంగళూరులో మాదిరిగా సమస్యలు రాకుండా చూడాలని కోరారు. దీనికి ముగ్ధుడైన కేటీఆర్.. ఆ చిన్నారిని తాను స్వయంగా కలుస్తానని అన్నారు.
కంగ్రాట్స్ కేటీఆర్..
వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుపై నాగార్జున, గుత్తా జ్వాలా శుభాకాంక్షలు
హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు రావడం అభినందనీయమని సినీ నటుడు అక్కినేని నాగార్జున, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా వారు శుభాకాంక్షలు తెలిపారు.