హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కాకతీయుల చరిత్రను చాటిచెప్పేలా గురువారం నుంచి ఈ నెల 13 వరకు కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నటు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను హైదరాబాద్లోని తన కార్యాలయంలో మంగళవారం పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాసర్తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయ పాలనా వైభవం, చారిత్రక విశిష్టత తెలిపేలా కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ వేడుకలకు ఆర్థిక వనరులను ప్రభుత్వం సమకూరుస్తుందని, పర్యాటక, సాంస్కృతిక శాఖ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు ఇందుకు ఏర్పాట్లు చేస్తాయని తెలిపారు. రాజకీయలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా కార్యక్రమాలను రూపొందించాలని ఆధికారులను ఆదేశించారు.
అఖిపక్ష నేతల అభిప్రాయాలు తీసుకోవాలి
జిల్లా ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి సమన్వయం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ను ఆదేశించారు. వరంగల్ నగర ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించాలని, నిపుణులతో కాకతీయ గొలుసుకట్టు చెరువుల నిర్మాణంపై ప్రత్యేక సదస్సు నిర్వహించాలని చెప్పారు. కవులు, కళాకారులను భాగస్వామ్యం చేయాలని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ కవులు, కళాకారులను సన్మానించాలని సూచించారు.
కాకతీయ వైభవ సప్తాహం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేడుకలకు విస్తృత ప్రచారం కల్పించేలా వరంగల్ నగరం మొత్తం హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని, డిజిటల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచించారు. కాకతీయ శిల్పకళ వైభవాన్ని తెలిపేలా కాఫీ టేబుల్ పుస్తకాన్ని రూపొందించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, వరంగల్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఓం నమ:శివాయ పాల్గొన్నారు.