KTR | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేసి, పోరాట పంథాలో కదం తొకుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీని వదిలి వెళ్తున్నారని, పోయే నాయకులు కొన్ని రాళ్లు వేసి వెళ్తారని మండిపడ్డారు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుందని తెలిపారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, పార్టీ క్యాడర్ను కాపాడుకొనే బాధ్యత తీసుకుంటామని, వారికోసం కష్టపడి పనిచేస్తామని అన్నారు. కార్యకర్తల కోసం తానే స్వయంగా వస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. ‘ఒకడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు చేసినా అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్ది. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏండ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి, తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి, కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు’ అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి రోజుకో స్కాం పేరుతో లీకులు ఇస్తూ కాలం గడిపేస్తున్నారని సీఎం రేవంత్పై విరుచకపడ్డారు.
శుక్రవారం తెలంగాణభవన్లో చేవేళ్ల లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీని విడిచివెళ్లి ద్రోహం చేసిన మాజీమంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి తిరిగి వస్తామని కేసీఆర్ కాళ్లు మొక్కినా పార్టీలోకి తీసుకోబోమని తేల్చిచెప్పారు. ‘రంజిత్రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్లో చేరారు. 2014లో విశ్వేశ్వర్రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంపీగా గెలిపించాం. 2019లో కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయారు. ఇప్పుడు రంజిత్రెడ్డి కూడా అంతే. కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయినరోజు నవ్వుకుంటూ కాంగ్రెస్లోకి పోయిన రంజిత్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డిపై మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మహేందర్రెడ్డి, సునీతామహేందర్రెడ్డి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా గుర్తుపట్టలేడు’ అని వ్యాఖ్యానించారు.
నా సవాల్పై రేవంత్ స్పందించరేం?
‘మల్కాజిగిరిలో పోటీ చేయాలని విసిరిన సవాల్కు సీఎం రేవంత్రెడ్డి స్పందించటం లేదు. ఆయన సొంత సిట్టింగ్ ఎంపీ స్థానంలో పోటీకి వెనుకంజ వేస్తున్నారు. సీఎంగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కారు ఐదేండ్లు అధికారంలో ఉండాలనేదే తమ ఆకాంక్ష అని, తాము కూలగొట్టబోమని స్పష్టం చేశారు. రేవంత్ పక్కన ఉన్న ఖమ్మం, నల్లగొండ బాంబులే కూలగొడతాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డి బీజేపీకి బీ-టీమ్గా మారారని ఆరోపించారు.
ఏ వర్గమూ సంతోషంగా లేదు
‘కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉన్నదో చెప్పాలి. రుణమాఫీపై మాట్లాడటం లేదు. ఉచిత కరెంటు కొద్దిమందికే అమలు చేస్తున్నారు. తాగు, సాగునీటికి దిక్కులేదు. కరెంటు సరిగా రాదు. రైతుబంధు పడటం లేదు’ అని ప్రభుత్వాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీపై పోరాటం చేయాలంటే కేసీఆర్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్తోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలం లో ఉన్నప్పుడు అండగా ఉండేందు కు ముం దుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని కేటీఆర్ అన్నారు. చేవెళ్లలో నిలబడ్డది కాసాని జ్ఞానేశ్వర్ కాదు.. కేసీఆర్ అన్నట్టుగానే పార్టీశ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 13న జరిగే చేవెళ్ల పార్లమెంట్ మీటింగ్కు ప్రతి ఒకరు తరలిరావాలని కోరారు.
కార్యకర్తల శక్తిని చూపాలి
నా చిరకాల కోరిక వికారాబాద్ జిల్లా ఏర్పాటు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. బడుగుల గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకొందాం. చేవేళ్ల, మల్కాజిగిరి రెండు స్థానాల్లో ప్రత్య ర్థి పార్టీల అభ్యర్థుల మన వాళ్లే.. ఎన్నికల్లో వారు కార్యకర్తల శక్తిని తక్కువ అంచనా వేశారు. ఎన్నికల్లో శక్తిని చూపుదాం.
– సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి
నాయకులే ఆగం అవుతున్నరు..
ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారంటూ టీవీలు, పత్రికల్లో ఏవేవో రాస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టే కాంగ్రెస్ వాళ్లు ఆహ్వానిస్తున్నారు. తాము బేవకూఫ్ గాళ్లం కాదు.. పోయిన వాళ్లు గడ్డి తిని పోతున్నారు. కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు అందరం ఒక్కటై ఉండాలి. ప్రజల్లో బీఆర్ఎస్కు బలం ఉంది, నాయకులే సహనం కోల్పోతున్నారు. కేసీఆర్, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. స్థానిక నాయకుల వల్ల ఓడిపోయాం.
– అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్
విలువలతో బతుకుతా..
ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రభుత్వం నిధులు ఇస్తుంది.. వారు అనధికార ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో నేను ఏదో ఆశించి బీఆర్ఎస్లోకి రాలేదు. ఏ ఇతర పార్టీలోకి పోను. కేసీఆర్ దయ వల్ల రెండు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచా. నేను కాంగ్రెస్లోకి రానని రంజిత్ రెడ్డికి కూడా చెప్పా.
– కాలె యాదయ్య, ఎమ్మెల్యే చేవేళ్ల
వారు తెలంగాణ ద్రోహులు
కేశవరావు, కడియం శ్రీహరిలు సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోహులు. తెలంగాణ అమరవీరుల మీద గన్ పెట్టిన రేవంత్ రెడ్డితో చేతులు కలిపారంటే వారిని ఏమనాలి. ప్రతి ఒక్కరి గుండెల మీద కేసీఆర్ చరిత్ర రాసి ఉన్నది. అది చెరిపివేయలేరు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుంటే రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ఉండరు.
-కల్వకుంట్ల సంజయ్ , ఎమ్మెల్యే, కోరుట్ల,
ఇప్పుడు వేరే రాజకీయాలు నడుస్తున్నాయి
పక్కన ఉండి పక్కలో బల్లెం తయారై పార్టీని విడిచిన వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు బ్లాక్ మెయిల్, పోలీస్, ఐటీ, ఈడీ రాజకీయాలు నడుస్తున్నాయి. మనం మాత్రం తెలంగాణలోని ప్రతి కుటుంబం బాగుపడాలని రాజకీయం చేశాం. ప్రజలను బాగు చేసే ఆలోచనలో కాంగ్రెస్ లేదు. మనకు మంచి రోజులు వస్తాయి.
– అరికపూడి గాంధీ, ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి