KTR | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మించి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనైనా ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అటెండర్ నుంచి గ్రూప్ -1 అధికారి వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం మరేదైనా ఉంటే చూపాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు. తమ హయాంలో ప్రతి ఏడాది 19 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ మాత్రం 2004 నుంచి 2014 వరకు ఏడాదికి 1000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు. 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి వాటికి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారో, ఎప్పుడు పరీక్ష పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశా రు. శనివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, గాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎం శ్రీనివాస్రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం పై కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేశారని గుర్తుచేశారు. ప్రధాని వద్ద ఒత్తిడి తెచ్చి తెలంగాణలో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి కావడం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభు త్వం 24,086 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తే, అందులో తెలంగాణకు వచ్చింది 10 వేలు మాత్రమేనని తెలిపారు. కేసీఆర్ హయాంలో 2,32,308 ఉద్యోగాలకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చినట్టు వివరించారు.
ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు
టీఎస్ఐపాస్ ద్వారా తాము 24 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని, పరిశ్రమలు రావడం ద్వారా ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2.36 లక్షల ఉద్యోగాలతో కలిపి పదేండ్లలో 26.3 లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చినట్టు వివరించారు. మరే రాష్ట్రమైనా ఇంతకుమించి ఉద్యోగాలను భర్తీ చేసినట్టు నిరూపిస్తే తెల్లారే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. రేవంత్రెడ్డి వచ్చాక ఐదు నెలల్లో ఒక నోటిఫికేషన్ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. తామిచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసి దానికి 60 పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చాడని గుర్తుచేశారు. డీఎస్సీ ద్వారా తాము 28 వేల ఉద్యోగాలు వేస్తే రేవంత్ అప్పుడు లొల్లి పెట్టిండని, తాము డీఎస్సీ ద్వారా 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దానిని రద్దుచేసి మరో 5 వేల ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చాడని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నిండు అసెంబ్లీలో మాట మార్చారని విమర్శించారు. గతంలో టెట్ ఫీజు రూ. 400 ఉంటే గొడవ చేశారని, ఇప్పుడు దానిని రూ. 2 వేలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ ద్వారా 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే దానిని రద్దు చేశారని మండిపడ్డారు.
బ్రూ ట్యాక్స్
భట్టి ట్యాక్స్, రేవంత్ ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ ఇలా రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ మొదలైందని, ఎవరి దుకాణం వాళ్లదేనని కేటీఆర్ విమర్శించారు. బిల్డర్ల మీద కూడా ట్యాక్స్ వేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. పదేండ్లు అధికారానికి దూరమైన వీరు ఇప్పుడు అందినకాడికి దోచుకుంటున్నారని పేర్కొనారు. జూపల్లి కృష్ణారావు కూడా కొత్త దుకాణం స్టార్ట్ చేయబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రూ. 3 వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన కేన్స్ సైన్స్ టెక్నాలజీస్, వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టే కార్నింగ్ సంస్థలు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ నుంచి టెక్ మహీంద్రా కూడా వెళ్లిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
రాకేశ్రెడ్డిని గెలిపిస్తే ప్రశ్నిస్తాడు
బీర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపిస్తే హామీలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని, ఆయనను గెలిపించాలని వరంగ ల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాకేశ్రెడ్డి గోల్డ్మెడలిస్ట్ అని, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ఎవరినీ బ్లాక్మెయిల్ చేయలేదని తెలిపారు.
కోమటిరెడ్డి జోకర్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జోకర్గా మారిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కరెం టు పోతే జనరేటర్ ఉండదా? అని ప్రశ్నించే వీళ్లు ప్రభుత్వం నడపడం చేతకాని సన్నాసులని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా అబద్ధపు ప్రచారాలను యూత్ నమ్మిందని పేర్కొన్నా రు. ఉస్మానియా విద్యార్థులు బీరు, బిర్యానీకి ఆశపడే అడ్డా కూలీలంటూ రేవంత్రెడ్డి అవమానించారని కేటీఆర్ గుర్తుచేశారు.
కరెంటు ఇచ్చుడు చేతకాక సన్నాసి మాటలు
పదేండ్లు తాము నడిపిన సంస్థలను కాంగ్రె స్ ప్రభుత్వం ఎందుకు నడపలేకపోతున్నదని కేటీఆర్ ప్రశ్నించారు. కరెంటు ఇచ్చు డు చేతకాక సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 20 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే యాదాద్రి పవర్ ప్లాంట్ను అప్పగించినా కోతలు లేకుండా నడపలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరంగల్ ఎంజీఎం, భువనగిరి దవాఖానల్లో కరెంటు పోతే టార్చ్లైట్ల వెలుగులో వైద్యం చేశారని గుర్తుచేశా రు. మేడిగడ్డ విషయంలోనూ కొండ ను తవ్వి ఎలుకను పట్టినట్టు చేశారని విమర్శించారు. అప్పడు తాము చెప్పి నా పట్టించుకోకుండా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పిందని ఇప్పుడు కాఫర్ డ్యాం కడతామని చెప్తున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
100 కుటుంబాలకు 2 లక్షల ఇన్సూరెన్స్ పత్రాలు
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ మంజూరు పత్రాలను శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన వారిని తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యకర్తల కోసం బీఆర్ఎస్ రూ.2 లక్షల ఇన్సూరెన్స్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం దాదాపు 100 మంది కుటుంబాలకు ఇన్సూరెన్స్ పత్రాలను కేటీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే ఎవరూ ఇవ్వనన్ని ఉద్యోగాలు ఇచ్చాం. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించాం. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 మధ్య తెలంగాణలో ఉద్యోగాల భర్తీ 10 వేలే. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాలిచ్చాం. తెలంగాణకు మించి ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందని నిరూపిస్తే తెల్లారే రాజీనామా చేస్తా. 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి వాటికి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారో, ఎప్పుడు పరీక్ష పెట్టారో చెప్పాలి.
– కేటీఆర్