హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ ఆ జాతికి మార్గంచూపిన మహనీయుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణభవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిందని తెలిపారు. ఆయన చేసిన సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన భోగ్బండార్ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు సరైన న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. ఆనాడే నాలుగు లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు దక్కాయని చెప్పారు. గిరిజన గూడాలు, తండాలు పంచాయతీలు అయ్యాయని, రిజర్వేషన్లు దక్కాయని, గిరిజన ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకంతో పెండ్లిలకు ఆర్థికసాయం అందిందని వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, గిరిజన నాయకులు వాల్యా నాయక్, రాంబాల్ నాయక్, రూప్ సింగ్, కరాటే రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజన మహళలు గిరిజన సంప్రదాయ నృత్యం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవితలు కూడా వారితో కల్సి నృత్యం చేశారు.