హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఆర్థికంగా వెనుకబడిన 50 మంది యువతుల చదువు, సాధికారత బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన స్పర్శ-2026 వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన 50వ పుట్టినరోజు సందర్భంగా 50 మంది యువతుల చదువు, సాధికారత బాధ్యత నెరవేర్చేందుకు తన వ్యక్తిగత ఖాతా నుంచి ఖర్చు భరిస్తానని వెల్లడించారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయడం మానవత్వమని, భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి సత్కార్యాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా స్పర్శ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. సమాజసేవకు అంకితమైన ‘టచ్ ఏ లైఫ్’ థీమ్తో సాగుతున్న ఈ సంస్థ మహిళల విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని ప్రశంసించారు. ప్రజా జీవితంలో రోజూ ఎంతోమందిని కలుస్తామని, కొన్ని సందర్భాల్లోనే గుండె నిండా సంతోషంతో ఇంటికి వెళ్తామని చెప్పారు. అలాంటి సందర్భాల్లో స్పర్శ వార్షికోత్సవ వేడుక ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సినీ నటి అక్కినేని అమల గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసమే గెలుపునకు నాంది
విద్యార్థులతో కేటీఆర్ కాసేపు ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. యువతలో ఆత్మవిశ్వాసమే గెలుపునకు నాంది అవుందని తెలిపారు. మనం ఏ స్థాయిలో ఉన్నా సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని సూచించారు. ‘టచ్ ఏ లైఫ్’లో ఉన్న యువతులందరిలో తన కూతురుని చూస్తానని ఉద్ఘాటించారు. తాను బయట నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా ఉన్నా ఇం ట్లో అందరిలానే ఉంటానని పేర్కొన్నారు. తన కూతురు అందరు తండ్రుల్లానే తనను డామినేట్ చేస్తుందని చెప్పారు. బయట ఎంత గంభీరంగా ఉన్నా ఎవరైనా ఇంట్లో తగ్గి ఉండాల్సిందేనని చెప్పారు. యువతులు దేన్నైనా ఆత్మవిశ్వాసంతో కృషి చేసి సాధించాలని సూచించారు. జీవితంలో విజ యం సాధించేందుకు సమయ పాలన, ఇతరులతో ప్రవర్తించే తీరు, ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలని తెలిపారు. ఈ మూడు అలవర్చుకుంటే చదువు, ఉద్యోగం, కీర్తి వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు. తమ యుక్త వయస్సులో భవిష్యత్తుపై కన్ఫ్యూజ్ అయ్యేవాళ్లమని, కానీ ఇప్పటి పిల్లల్లో చాలా మెచ్యూరిటీ ఉంటుందన్ని చెప్పారు. 15 ఏండ్ల కిందట సోషల్ మీడియా ప్రభావం లేదని, ఇప్పుడు యుక్త వయస్సులోనే పిల్లలు ఇన్ఫ్లుయెన్సర్లుగా ఎదుగుతున్నారని వెల్లడించారు. నచ్చినది చేస్తూ, ఆర్థికంగా ఎదిగితే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ మనస్సును మీరు అదుపులో ఉంచుకొని మీకేం కావాలో? ఏది వద్దో? తెలుసుకుంటే విజయం సాధిస్తారని స్పష్టంచేశారు.