సికింద్రాబాద్, ఆగస్టు 14: భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు. 75 ఏండ్లలో మనం సాధించిన విజయాలకు తోడు, మన ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శమని, దీనిని భవిష్యత్లోనూ కొనసాగించాలని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారత ఆర్మీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కాలుకు గాయమై మూడు వారాలుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. చేతికర్ర సహాయంతో తొలిసారి ఆర్మీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆర్మీ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలిసారిగా బయటికి రావడం సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్య్రం అంటే ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో విధంగా ఉంటుందని చెప్పారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా వివిధ దేశాలు తిరిగినప్పుడు చాలా మంది మన దేశాన్ని చైనాతో పోల్చి చూశారని గుర్తు చేశారు. అత్యధిక జనాభా, మానవ వనరులు కలిగిన చైనా, భారత్లు అన్నింటా పోటీ పడుతూ ఉండటం సహజమని అన్నారు. విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు కలిగిన మన దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకు అన్నీ మారిపోతూ ఉంటాయని చెప్పారు. భాష, యాస, కట్టుబొట్టు, ఆహార అలవాట్లు ఇలా అన్నింటా వ్యత్యాసం ఉంటున్నా.. అందరినీ ఒక్కతాటిపై నిలిపేది మాత్రం భారతీయతే అన్నారు. ఇంత చక్కని కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఆర్మీ దక్షిణ్ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్, లెఫ్టినెంట్ జనరల్ ఆరుణ్కుమార్కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సైనికులు, కళాకారులు, విద్యార్థులు నిర్వహించిన విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కేరళ సంప్రదాయ నృత్యాలను కళాకారులు మంత్రి కేటీఆర్ ముందు ప్రదర్శించారు. మంత్రి ఆద్యంతం కళాకారులను ఉత్సాహ పరిచారు. కాలికి గాయమై వైద్యుల సూచనతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి కేటీఆర్.. తన విధుల్లో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి క్లియర్ చేశారు. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తూ విధులు కొనసాగిస్తున్నారు.