హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్తో కలిసి పని చేసేందుకు అమెరికాలోని బోస్టన్ నగరం ముందుకొచ్చింది. మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఈ మేరకు ప్రకటించారు. బోస్టన్లో శుక్రవారం జరిగిన ‘గ్లోబల్ ఇన్నోవేషన్- 2022 హెల్త్కేర్ ఎట్ ఏ గ్లాన్స్’ సదస్సులో గవర్నర్ బేకర్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, బోస్టన్ నగరాల మధ్య అనేక సారూప్యతలున్నాయని తెలిపారు. హైదరాబాద్లాగే బోస్టన్ కూడా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు కేంద్రంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణ, మసాచుసెట్స్ రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు పరస్పర అవకాశాలను పరిశీలించడంతోపాటు లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. మసాచుసెట్స్లో హెల్త్ రికార్డుల డిజిటలైజ్ చేస్తున్నామని, దీని వల్ల పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
హైదరాబాద్, బోస్టన్ నగరాల మధ్య ఇంటర్ సిటీ అవగాహన ఒప్పందం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో పౌరుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. లైఫ్ సైన్సెస్, ఐటీ, టెక్ రంగాల డాటా సైంటిస్టుల ఉమ్మడి కృషితో రానున్న రోజుల్లో అద్భుత ఆవిషరణలు వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యంతో తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నదని, పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతున్నదని వెల్లడించారు. బోస్టన్లోని నిర్వాణ లైఫ్ కేర్లో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, నిర్వాణ హెల్త్ కేర్ చైర్ పర్సన్ జాన్ సల్లీ, సీఈవో రవి ఐక, శశి వల్లిపల్లి తదితరులు పాల్గొన్నారు.
థర్మో ఫిషర్ లైఫ్ సైన్సెస్, లేబొరేటరీ ప్రొడక్ట్స్ గ్రూపు గ్లోబల్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు జూలీ డివానే, కంపెనీ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు టై మోర్టెన్సెన్తో మంత్రి కేటీఆర్ శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న నూతన ఆర్ అండ్ డీ కేంద్రం గురించి వారికి వివరించారు. సైంటిఫిక్ (ల్యాబ్) పరికరాలు, రియోజెంట్ల సరఫరాలో గ్లోబల్ లీడర్గా ఉన్న థర్మోఫిషర్ సైంటిఫిక్ సంస్థ హైదరాబాద్లో శరవేగంగా విస్తరిస్తున్నందుకు సంతోషం వ్యక్తంచేశారు.
ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అమెరికాలోని వివిధ కంపెనీల ప్రతినిధులకు ఆయన వివరించారు. బోస్టన్లో పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్గా పేరుగాంచిందని, లైఫ్ సైన్సెస్ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నదని తెలిపారు. ఇన్నోవేషన్కు సంబంధించి ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయడంతోపాటు జీనోమ్ వ్యాలీలో ప్రత్యేకంగా ఇంక్యుబేటర్ను నెలకొల్పిందని వివరించారు.