KTR | సీఎం రేవంత్ హింసించే రాజు పులకేశిలా తయారైండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనకు కేటీఆర్ సోమవారం బహిరంగ లేఖ రాశారు. అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి, సబ్బండ వర్గాలకు చేసిన మోసం, అభివృద్ధి తెలంగాణను అవినీతి తెలంగాణగా మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని కేటీఆర్ డిమాండ్ చేశారు. పదేళ్లలో ఘనంగా అభివృద్ధి చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీకి.. పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా ఒక్కసారి మీకు గుర్తు చేయదలచుకున్నానన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి.. తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ధ్వజమెత్తారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా ఒక్కరంటే సమాజంలో అన్ని వర్గాలను నయనంచనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఒక్క హామీని సైతం నిలబెట్టకోకుండా ప్రజలను మోసం చేశారని.. సీఎం రేవంత్రెడ్డి ప్రజలను హింసించే పులకేసి మాదిరిగా హింసిస్తుంటే.. ఏం తెలియనట్లుగా నటిస్తూ ఢిల్లీలో గప్చుప్ అయిపోయారని విమర్శించారు.
అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచే మీ నయవంచన స్వరూపం ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారని కేటీఆర్ ధ్వజమెత్తారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అంటూ ఊదరగొట్టి మూడు వందల రోజులు దాటినా సరే వాటిని అమలు చేయటం చేతకాక చేతులెత్తేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కబంధ హస్తల్లో చిక్కుకొని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు విలవిలలాడుతోందని.. అభయహస్తమని నమ్మబలికి భస్మాసుర హస్తంతో తెలంగాణ ప్రజలను నిండా ముంచారని.. ఒక్కటా, రెండా ఈ ఏడాదిలో మీ పార్టీ పాలన వైఫల్యాలు చిత్ర గుప్తుడి చిట్టా అంత అవుతున్నాయన్నారు. నమ్మించి మోసం చేయడమనే నైజం కాంగ్రెస్ నరనరాల్లోనే ఉందన్నారు. ఆరు గ్యారంటీలు, అభయ హస్తం అంటూ ఇక్కడి ప్రజలను మోసం చేసేందుకు ముందుగా ఢిల్లీ నుంచి వచ్చి నాంది పలకింది రాహుల్ గాంధీయేనని.. యథా రాజా తథా ప్రజా.. అన్న తరహాలోనే మీ బాటలోనే తెలంగాణ నాయకులు నడుస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత నాది అని చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగి కూడా చూడలేదని విమర్శించారు. మూడు వందల రోజులైనా ఒక పరిమిత ఉచిత బస్ మినహా ఒక్క గ్యారంటీని అమలు చేయలేని అసమర్థత అని.. రైతులకు రుణమాఫీ అని చెప్పి సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో మాత్రం పూర్తి రుణమాఫీ చేసేశామంటూ సిగ్గులేకుండా అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రుణమాఫీయే కాదు రైతు భరోసాను ఎత్తగొట్టారని.. బోనస్ను బోగస్ చేశారని ఆరోపించారు. కనీసం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని దద్దమ్మల మాదిరిగా తయారయ్యారని.. నమ్మి ఓటు వేసినందుకు ఒక్క వర్గం కాదు తెలంగాణలోని సబ్బండ వర్గాలను మోసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న తీరును సమాజం గమనిస్తోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమ మా బాధ్యత అంటూ ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పారని.. కానీ, ఇప్పుడు అన్ని వర్గాల సంక్షేమాన్ని నాశనం చేసే పనిని విజయవంతంగా కొనసాగిస్తున్నారన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ సాధించింది ఏంటంటే సబ్బండ వర్గాలను రోడ్డెకించటమేనని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, అంగన్ వాడీలు, పోలీసులు ఇలా అన్ని వర్గాల వాళ్లు ప్రతి రోజు రోడ్లపై ధర్నాలు, నిరసనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా పోలీసులను పోలీసులతోనే కొట్టించిన ఘనత మీకే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయటమే క్షమించారని తప్పంటే.. అది చాలదన్నట్లుగా గెలిపించిన ప్రజలను హింసిస్తున్నారు.
సాధారణంగా ప్రజల బాధలను తీర్చడం పాలకుల బాధ్యతని, వారిని బాధించడం ఏమాత్రం సరికాదన్నారు. మీ సీఎం రేవంత్రెడ్డి హింసించే పులకేసి మాదిరిగా తయారయ్యాడని.. మూసీ, హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల పొట్ట కొడుతున్నాడు. హైడ్రా, మూసీ పేరు చెబితినే ప్రజలు హడలిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు గూడు కట్టిస్తామంటూ నమ్మబలికి వాళ్ల గూడును చెదరగొట్టిన గొప్ప పాలన మీ ప్రభుత్వానిది. పేద, మధ్య తరగతి ప్రజలను ఇళ్లను కూలగొడుతుంటే వాళ్ల చేసిన ఆర్తనాదాలు మీకెందుకు వినబడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా వస్తా అని బీరాలు పలికినా మీరు ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. స్వయంగా అశోక్ నగర్ కు వచ్చి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు నాది భరోసా అని చెప్పి ఆ నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు సిగ్గు అనిపించటం లేదా? అంటూ ప్రశ్నించారు. అశోక్నగర్లో నిరుద్యోగుల దగ్గరకు వెళ్లేందుకు రాహుల్ గాంధీకి దమ్ముందా ? సవాల్ విసిరారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు, రక్షణ కల్పిస్తున్న పోలీసులు, మూసీ, హైడ్రా బాధితులను, ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. అసలు తెలంగాణ ప్రజల ముందుకు వచ్చేందుకు రాహుల్ గాంధీకి దమ్ముందా? అని ప్రశ్నించారు.