హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం కౌంటింగ్ ఏజెంట్లు సమన్వయంతో వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ఏజెంట్లకు, అభ్యర్థులకు సూచించారు. శనివారం పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎక్కడైనా అనుమానం ఉంటే సదరు పోలింగ్ స్టేషన్లో రీకౌంటింగ్ కోసం రిటర్నింగ్ అధికారిని కోరవచ్చని, ఎన్నికల ప్రవర్తనా నియావళికి లోబడి ఏజెంట్లు వ్యవహరించాలన్నారు.
ఎగ్జిట్పోల్స్పై హైరానా వద్దు
పోలింగ్ ముగిసినప్పటి నుంచి వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్పై పార్టీ శ్రేణులు, అభ్యర్థులు, ఏజెంట్లు అయోమయానికి లోను కావాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. కొంతమంది అభిప్రాయాలు తీసుకొని సర్వేలు నిర్వహించి, 4 కోట్ల ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయటం కష్టమని గత అనుభవాలు చెప్తున్నాయని గుర్తుచేశారు. 2018లోనూఎగ్జిట్పోల్స్ బీఆర్ఎస్ అసాధారణ విజయాన్ని అంచనా వేయలేకపోయాయని చెప్పారు.ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్పోల్స్ చెప్పాయని, సర్వేలను తుత్తునియలు చేస్తూ అక్కడ మమతా బెనర్జీ విజయం సాధించారని గుర్తుచేశారు.
హ్యాట్రిక్ లోడింగ్ 3.0 : కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ట్వీట్ ఆ పార్టీ కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. ఎగ్జిట్ పోల్స్ను తలదన్నేలా కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా చేసిన ట్వీట్ గులాబీవనంలో జోష్ తీసుకొచ్చింది. ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0.. గెట్ రెడీ టు సెలబ్రేషన్స్ గైస్’ అంటూ లోడ్ చేసిన గన్ను గురిపెడుతూ మంత్రి కేటీఆర్ పెట్టిన పోస్టు నిమిషాల్లో వైరల్గా మారింది. ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి ఏ సోషల్ మీడియా వేదికల్లో చూసినా ఈ ఫొటోనే ట్రెడింగ్లో ఉన్నది. ఇది గంటలోనే 4.46 లక్షల వ్యూస్ను సొంతం చేసుకోగా.. 20వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక వేలాది మంది నెటిజన్లు కామెంట్లు, రీ ట్వీట్లు చేశారు. లక్షలాదిమంది ఈ ఫొటోను వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకుంటున్నారు.