హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేటి నుంచి పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వెళ్తున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్తో పాటు స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. లండన్లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీకానున్నారు.
ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు.ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 26న తిరిగి రాష్ట్రానికి కేటీఆర్ చేరుకోనున్నారు. పర్యటనలో కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం వెళ్లనున్నారు.