హైదరాబాద్, సెప్టెంబర్ 17, (నమస్తే తెలంగాణ): ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ రంగా ల్లో పెట్టుబడులు పెట్టాలని జర్మనీకి చెందిన దిగ్గజ కంపెనీలను పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆహ్వానించారు. భారతదేశంలో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండార్, ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్షాద్ అఖతోవ్ శుక్రవారం మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జర్మనీ దిగ్గజ కంపెనీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడానికి, తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను పరిచయం చేసేందుకు సహకరించాలని కోరారు. ఇప్పటికీ దేశంలోకి అత్యంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని వివరించారు. తెలంగాణ విద్యార్థులు ఇక్కడ ఇంజినీరింగ్ పూర్తిచేసి జర్మనీకి ఉన్నతవిద్య కోసం వెళ్తున్నారని, వారి కోసం ఏమైనా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందా? అని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. జర్మనీలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల విజయప్రస్థానం, ఎకానమీలో పాత్ర, ప్రభుత్వ సహా య సహకారాల గురించి వాకబు చేశారు. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడానికి అవలంబిస్తున్న డ్యూయల్ డిగ్రీ వంటి కోర్సుల వివరాలపై ఆరాతీశారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలత, వినూత్న విధానాల ఆధారంగా మ రిన్ని పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండార్ అన్నారు. ఉజ్బెకిస్తాన్ రాయబారి బృందం రెండురోజులుగా తెలంగాణలో పర్యటించిన అనంతరం మంత్రి కేటీఆర్తో సమావేశమైంది. తమ దేశంలో పెట్టుబడి అవకాశాలను అఖతోవ్ వివరించారు.