హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య అసెంబ్లీ సమావేశ మందిరంలో ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభ ప్రారంభం కాకముందు మంత్రి కేటీఆర్ సభ్యులందరినీ పలుకరించారు. బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్ కూర్చున్న సీట్ల వద్దకు వెళ్లి పలుకరించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదని ఈటలను కేటీఆర్ అడిగారు. మీ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అక్కడ జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా? అని ప్రశ్నించారు. దీనిపై ఈటల స్పందిస్తూ.. పిలిస్తే కదా వచ్చేది అంటూ సమాధానం ఇచ్చారు. తనకు అధికారులు ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వడంలేదని చెప్పారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా తనకు సైతం అధికారిక సమాచారం ఇవ్వడంలేదని ప్రస్తావించారు.
సభ ప్రారంభం రోజున బీజేపీ సభ్యుడు రాజాసింగ్ కాషాయం చొక్కా ధరించి రావడంపై ఆసక్తికర చర్చ జరిగింది. చొక్కా రంగు కండ్లకు గుచ్చుకుంటుందని, ఈ రంగు తనకు ఇష్టం ఉండదని రాజాసింగ్తో కేటీఆర్ అన్నారు. కాషాయ రంగు చొక్కా భవిష్యత్తులో మీరూ వేసుకోవచ్చేమో అని రాజాసింగ్ సరదాగా జవాబిచ్చారు.