KTR | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కొన్ని టీవీ, సోషల్ మీడియా చానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. తనను, తన కుటుంబాన్ని బద్నాం చేయాలన్న కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలు, కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయని పేర్కొంటూ 9 టీవీ, సోషల్ మీడియా చానళ్లకు నోటీసులు పంపారు. ‘పక్కా ప్రణాళిక ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ ఒక పక్కా ఎజెండాలో భాగమే. మీడియ ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నాయి. మాకు సంబంధమే లేని అనేక అంశాల్లో మా పేరును, ఫొటోను వాడుతూ, అత్యంత హీనమైన తంబ్నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్న చానళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నా. వీరందరు చట్టప్రకారం శిక్ష ఎదుర్కొనక తప్పదు. ఇప్పటికైనా సంబంధం లేని అంశాల్లో తమపై దుర్మాగ్గపూరిత ప్రచారం చేస్తూ, పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలి’ అని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అసత్యపూరిత అంశాలను వెంటనే తొలగించకుంటే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ చానళ్లు ఇప్పటికే తమ తప్పును సరిదిద్దుకొని, వీడియోలు, కంటెంట్ను తొలగించాయని వెల్లడించారు. వారంలోగా మిగిలిన మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్లు ఇలాంటి కంటెంట్ తీసివేయకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. తమకు, తమ పార్టీకి సంబంధం లేని అంశాలపై అడ్డగోలు ప్రచారం, అసత్య ప్రచారం చేసే ప్రతి ఒక మీడియా సంస్థ, యూట్యూబ్ చానళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని గుర్తించాలని తేల్చిచెప్పారు. కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్కు కూడా లీగల్ నోటీసులు పంపించామని పేర్కొన్నారు. తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ మరిన్ని లీగల్ నోటీసులు, కేసులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.