హనుమకొండ, అక్టోబర్ 16 : గొప్ప సామాజిక స్పృహ, తెలంగాణ మీద మమకారంతో పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకుడు పిన్నింటి విజయ్కుమార్ రాసిన అనేక వ్యాసాలను ‘నా ఆలోచనలు’ అనే శీర్షికతో ఒక మంచి పుస్తకంగా తేవడం గొప్ప పరిణామమని కేటీఆర్ రచయితను అభినందించారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం గురించి, ప్రాంతీయ, జాతీయ పరిస్థితులపై చాలా మంచి అవగాహనతో ఎన్నో వ్యాసాలను గతంలో రాశారు. ఇప్పుడు కొత్తగా ఆ వ్యాసాల సంకలనాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. పుస్తక పఠనం తగ్గిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి యువ రచయితలు ముందుకు వచ్చి పుస్తకాలు రాస్తున్న విజయ్ లాంటి వారిని తప్పకుండా ప్రోత్సహించాలని కేటీఆర్ సూచించారు.
అనంతరం రచయిత, విద్యార్థి నాయకుడు విజయ్ని అభినందించారు. ఈ సందర్భంగా జనగామ శాసన సభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు ప్రత్యేకంగా పుస్తక ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, శేరి సుభాష్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ర్ట ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కేయూ బీఆర్ఎస్వీ ఇంచార్జి జెట్టి రాజేందర్, రాజేష్నాయక్, ప్రశాంత్, అభిషేక్, నితిన్, రాజేశ్వర్రావు పాల్గొని విజయ్కి అభినందనలు తెలిపారు.