హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విధానాల ఫలితాలు తెలంగాణలోని గడప గడపకూ చేరాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ పథకాలు యావత్ దేశానికే మార్గదర్శనంగా నిలిచి, సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాహారంగా రూపొందించిన ‘ప్రగతి ప్రస్థానం- ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? పుస్తకాన్ని శుక్రవారం కేటీఆర్ ఆవిషరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం అవుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, సాక్షాత్తు నీతి ఆయోగ్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పనితీరును ఇలాంటి నివేదికలెన్నో తేల్చి చెప్పాయని వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు, ప్రజలకు చేరువైన తీరును గణాంకాలతో సహా తన సంపాదకత్వంలో ప్రగతి ప్రస్థానం పుస్తకంగా వెలువరించిన సీనియర్ జర్నలిస్టు రమేశ్ హజారి కృషిని అభినందించారు. తెలంగాణ సమాచారం తెలుసుకొనే ప్రతి ఒకరికీ ఈ పుస్తకం ఒక హ్యాండ్ బుక్గా ఉపయోగపడుతుందని చెప్పారు. తన సాహిత్య ప్రతిభతో సోషల్ మీడియాలోనూ, పాటలు, సాహిత్యం, పుస్తకాల రూపంలోనూ సృజనాత్మక శైలిలో ప్రభుత్వ కార్యాచరణను జనంలోకి తీసుకుపోయేలా జర్నలిస్టు రమేశ్ హజారి పాటుపడుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.