Minister KTR | ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన హైదరాబాద్ క్యాపబులిటీ సెంటర్ను ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ప్రారంభించారు. వార్నర్ మీడియా, డిస్కవరీ సంస్థలు విలీనమై.. డిస్కవరీగా అవతరించాక ఆసియాలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఆఫీసును హైదరాబాద్లో ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ వార్నర్ బ్రోస్ తమ అభివృద్ధి కేంద్రం ఏర్పాటునకు హైదరాబాద్ను ఎంచుకోవడం గర్వంగా ఉందన్నారు.
ప్రకటించిన నాలుగు నెలల్లోనే వార్నర్ బ్రదర్స్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ.. ఈ ఏడాది మేలో తన అమెరికా పర్యటన సందర్భంగా న్యూయార్క్లో సంస్థకు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎలెక్స్ కార్టర్తో భేటీ అయ్యామని, ఈ సందర్భంగా హైదరాబాద్లో తమ క్యాపబులిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తమ కేపబులిటీ కేంద్రం ఏర్పాటునకు హైదరాబాద్ను ఎంచుకోవడంపై కృతజ్ఞతలు తెలిపుతూ.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం మరింత అభివృద్ధి చెందేందుకు వార్నర్ బ్రోస్ డిస్కవరీ దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇక్కడ 3,23,000 ఐటీ ఉద్యోగాలు మాత్రమే ఉండగా, నేడు కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ సుమారు పది లక్షలకు పెరిగినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. గడచిన తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఉద్యోగావకాశాలు మూడు రెట్లు, ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. యాపిల్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, సేల్స్ఫోర్స్, యూబర్, నోవార్టీస్ క్వాల్కామ్, వెల్స్ ఫోర్గో, మిక్రాన్ తదితర ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్లో తమ రెండో ప్రధాన కార్యాలయాలను నెలకొల్పినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సీఎఫ్ఓ గన్నార్ వైడెన్ఫెల్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్టర్, హైదరాబాద్ క్యాపబులిటీ సెంటర్ హెడ్ జైదీప్ అగర్వాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ ప్రత్యేక కార్యదర్శి డా. విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఐటీఈ అండ్సీ డిపార్ట్మెంట్ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.