KCR | బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన “గిరిజనుల ఆత్మబంధువు” పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ చేసిన సేవలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన శ్రీను నాయక్ను కేటీఆర్ అభినందించారు.
గిరిజనులకు కేసీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కేటీఆర్ కొనియాడారు. తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించి, గిరిజనులకు పోడు భూములపై హక్కులను కల్పించే విధంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి రైతుబందు పథకాన్ని అనువర్తింపజేయడం ఈ విధంగా ఎన్నో ఏండ్ల గిరిజన కలలను సాకారం చేసిన స్వాప్నికుడు కేసీఆర్ సేవలను ఈరోజు తండాలలో గూడాలలో గిరిజన జాతి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
అదేవిధంగా గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు, సీఎం ఎస్టీఈఐ పథకం, గిరి వికాస్, గిరి పోషణ, హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి వినూత్నమైన కార్యక్రమాలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. గిరిజన తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన రోజు ఆగస్టు 2వ తేదీ నాడు అన్ని గిరిజన గ్రామాలలో గిరిజన సంబురం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.