హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇండ్లస్థలాల క్రమబద్ధీకరణపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధ్యక్షతన క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటుచేస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. మంత్రులు టీ హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, వీ శ్రీనివాస్ గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ప్రధానంగా రాష్ట్రంలోని అనధికార లేఅవుట్స్, ఇండ్లస్థలాలు, ప్లాట్ల క్రమబద్ధీకరణ, గ్రామకంఠం అంశాలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నది. కమిటీ నియామకం నేపథ్యంలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో పెండింగ్ సాదా బైనామా, నోటరీ ప్లాట్ల ద్వారా ఇండ్ల నిర్మాణం, జీవో 58, 59లో అర్హత ఉండి తిరస్కరించిన, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అర్హులైనవారు ఎంతమంది ఉంటారన్న సమాచారం పంపించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్లో అడ్డగుట్ట, అంజయ్యనగర్ ప్రాంతాల్లో రెగ్యులరైజేషన్ పెండింగ్లో ఉన్న స్థలాల సమాచారాన్ని సేకరిస్తున్నారు.