KTR | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో సకల జనులు ఉవ్వెత్తున ఉద్యమించడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు నడిపిస్తూ అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ఇది తెలంగాణ దశాబ్ది’ అంటూ స్పందించారు.
ఆరున్నర దశాబ్దాల పోరాటం.. మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల బలిదానాలు, త్యాగాలు.. బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు.. ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష.. ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారమైందని గుర్తు చేశారు. ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారని కొనియాడారు. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసిందని.. ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి ఐటి ఎగుమతుల దాకా రికార్డులు బద్దలయ్యాయన్నారు. అందరి మద్దతుతో నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచామని.. నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపామన్నారు.
రైతన్నల, నేతన్నల, కష్టజీవుల కలత తీర్చినం.. కడుపు నింపామన్నారు. వృద్ధులకు ఆసరా అయ్యామని.. ఆడబిడ్డలకు అండగా నిలిచామన్నారు. సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేశామన్నారు. గుండెల నిండా జై తెలంగాణ నినాదం నింపుకొని మన భాషకు పట్టం గట్టామన్నారు. మన బతుకమ్మ, మన బోనం సగర్వంగా తలకెత్తుకున్నామని.. గంగా జమునా తెహజీబ్కు సాక్షీభూతంగా నిలిచామన్నారు. అవమానాలు, అవహేళనల ఎదుర్కొన్న గడ్డ మీదనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని అంబరమంత ఎత్తున ఎగరేశామన్నారు. కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది.. వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది అన్నారు.
ఇది తెలంగాణ దశాబ్ది!
ఆరున్నర దశాబ్దాల పోరాటం..
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..
వేల బలిదానాలు, త్యాగాలు..
బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..
ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..
ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా
స్వతంత్ర… pic.twitter.com/i7WD2IwOC2— KTR (@KTRBRS) May 21, 2024